ETV Bharat / city

సైబర్ కేటుగాళ్లు...పోలీసులకే కుచ్చుటోపీలు

author img

By

Published : Oct 9, 2020, 6:00 PM IST

సైబర్ కిలాడీలు...పోలీసులకే కుచ్చుటోపీలు
సైబర్ కిలాడీలు...పోలీసులకే కుచ్చుటోపీలు

సైబర్ కేటుగాళ్లు... పోలీసులకే టోపీలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసుల పేరుతో ఖాతాలు తెరచి..పోలీసుల స్నేహితుల నుంచి డబ్బు నొక్కేస్తున్నారు. అత్యవసరం అంటూ మెసేజ్​లు పెడుతూ నగదు దోచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు...సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెసేజ్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలకు...వారిపై చాలా మందికి గౌరవం పెరిగింది. దీన్ని అవకాశంగా మార్చుకున్నారు సైబర్ నేరస్థులు. పోలీసుల పేర్లు, ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. పోలీసుల ఖాతాలోని స్నేహితులను నకిలీ ఖాతాకు జతచేసుకుంటున్నారు. ఆపై నగదు అత్యవసరమని వెంటనే తిరిగి చెల్లిస్తామని మెసేజ్​లు పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలు ఇటీవల వెలుగుచూశాయి. తాజాగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరిట నగదు అత్యవసరమంటూ రాజస్థాన్ ముఠా ఫేస్​బుక్​లో మెస్సేజ్​లు పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలపై సైబర్​ క్రైమ్ పోలీసులకు నాలుగు ఫిర్యాదులు వచ్చాయి.

స్నేహితులే టార్గెట్​

'నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ..అత్యవసరంగా 5 వేల రూపాయల అవసరం' అంటూ ఓ ఆర్ ఎస్సై ఫేస్​బుక్​ లో తన స్నేహితునికి మెసేజ్ పంపారు. పేటీఎంలో పంపాలని నెంబర్ ఇచ్చారు. ఆ స్నేహితుడు వెంటనే ఆర్​ ఎస్సైకి ఫోన్ చేసి విషయం చెప్పేసరికి ఆయన షాక్ తిన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. సెల్​ఫోన్ నెంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఝార్ఖండ్, పేటీఎం ఖాతా అడ్రస్ పంజాబ్​లోని లూథియానాలో ఉన్నట్లు గుర్తించారు.

ముందు నిర్ధరణ చేసుకోండి

ఆర్మీలో పనిచేసి రిటైర్​​ అయ్యి ప్రస్తుతం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో ఎస్సై స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి ప్రొఫైల్​తో నకిలీ ఫేస్​బుక్ ఖాతాను తెరిచి .. ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి నగదు కొట్టేశారు. బాధితుడు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఇలాంటి మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల పేరుతో సైబర్ కిలాడీలు నగదు దోచుకోవటంతో పోలీసు సిబ్బందికి అధికారులు సూచనలు జారీ చేశారు. నగదు పంపాలని మెసేజ్​లు వస్తే ఫోన్ చేసి నిర్ధరణ చేసుకోవాలని ఫేస్​బుక్ ఖాతాల్లో స్నేహితులకు మెస్సేజ్ పెట్టాలని పోలీసు సిబ్బందికి సూచించామని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు.

ఈ తరహా సైబర్ నేరాలు రాజస్థాన్ కేంద్రంగా జరుగుతున్నట్లు పోలీసులను గుర్తించారు. ఎవరైనా నగదు పంపాలని సామాజిక మాధ్యమాల్లో మెసేజ్​లు చేస్తే ముందు నిర్ధరణ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.