POLI PADYAMI: రాష్ట్ర వ్యాప్తంగా పోలి పాడ్యమి వేడుకలు.. నది తీరాలకు పోటెత్తుతున్న భక్తులు

author img

By

Published : Dec 5, 2021, 8:06 AM IST

Updated : Dec 5, 2021, 10:50 AM IST

POLI PADYAMI CELEBRATIONS THROUGHOUT THE STATE

POLI PADYAMI: రాష్ట్రవ్యాప్తంగా పోలి పాడ్యమి వేడుకలను.. భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ముగియడంతో పుణ్య స్నానాలు ఆచరించి పోలి స్వర్గం దీపాలను.. నదుల్లో వదలడానికి భక్తులు నది తీరాలకు పోటెత్తారు.

POLI PADYAMI: కార్తీక మాసం ముగియడంతో పుణ్య స్నానాలు ఆచరించి పోలి స్వర్గం దీపాలను.. నదుల్లో వదలడానికి భక్తులు నది తీరాలకు పోటెత్తారు. దీంతో నదీ తీరాలు శివ నామ స్మరణలతో మార్మోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలి పాడ్యమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

పూర్వం పోలమ్మ అనే రజక మహిళ కార్తీక మాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమనిష్ఠలతో దీపారాధన చేసి పరమశివుని పూజించి మోక్షం పొందిందని.. కార్తీకమాసం ముగిసిన పాడ్యమి రోజు స్వర్గ ప్రాప్తి పొందిందని పురాణ కథనం. ఉండ్రాజవరంలోని సుబ్బారాయుడు కాలువ వద్ద, తణుకు లోని గోస్తనీ కాలువ వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేసారు. సమీపంలోని గోదావరి నది తీరంలోని పెండ్యాల, కాకరపర్రు తదితర గ్రామాల మహిళలు గోదావరిలో స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. కార్తీక మాసం ముగిసిన అనంతరం.. నదీ స్నానాలు ఆచరించి.. దీపాలను వెలిగించి నదిలో వదిలితే సకల పాపములు పోయి స్వర్గ ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం, కొత్తపాలెంలోని శివాలయం, కొమ్మమూరు, రొంపేరు కాల్వల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. దీపాలు వదులుతున్నారు. చీరాల, వేటపాలెం, మార్టూరు,పర్చూరు శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

తూర్పుగోదావరిలో

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో.. మహిళలు వైభవంగా పోలి పాడ్యమి వేడుకలను నిర్వహిస్తున్నారు. గోదావరి నదీ పాయల్లో దీపాలు వదులుతూ.. పూజలు చేశారు. అనంతరం ఆలయాలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడలోని ఉషా రాజేశ్వరీ సమేత భానులింగేశ్వర స్వామి ఆలయం, బాల త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి.. ఆలయాలతోపాటు జిల్లాలోని శివాలయాల్లో భక్తులు బారులు తీరారు.

పశ్చిమగోదావరిలో

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో.. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పోలి స్వర్గం దీపాలను వదులుతున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు గోదావరి నదికి పోటెత్తారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలను వదులుతున్నారు.

జిల్లాలోని ఉండ్రాజవరం, తణుకు పరిసర ప్రాంతాల్లో.. మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేసి నదులు, కాలువల్లో వదిలారు. దీపారాధన అనంతరం బ్రాహ్మణోత్తముల ద్వార పోలమ్మ స్వర్గ ప్రాప్తి పొందిన తీరును తెలుసుకుని స్వయం పాకాలు సమర్పించి ఆశీస్సులు పొందారు.

విశాఖపట్నంలో

విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న ఆలయంలో.. పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయంగా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి.. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకళ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. తోపులాటలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

విజయవాడలో

పోలి పాడ్యమి సందర్భంగా.. కృష్ణా తీరం దీపాలతో దేదీప్యమానంతో ప్రకాశించింది. కార్తీక పాడ్యమిని పురస్కరించుకుని.. పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణా నదిలో కార్తీక దీపాలను వదిలారు.

ఇదీ చదవండి: AMARAVATHI FARMERS MAHAPADAYATRA IN NELLORE : పాదయాత్రలో ఉద్రిక్తత...పోలీసులతో రైతుల వాగ్వాదం

Last Updated :Dec 5, 2021, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.