ETV Bharat / city

AP Cabinet: కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

author img

By

Published : Apr 7, 2022, 7:13 PM IST

Updated : Apr 8, 2022, 5:40 AM IST

కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మంత్రి హోదాలో ఇదే చివరి ప్రెస్‌మీట్‌ కావడంతో పేర్ని నాని కొంత ఉద్విగ్నంగా మాట్లాడారు. మూడేళ్ల పదవీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. మూడేళ్ల తన పనితీరును తెలుగు ప్రజలకు సుపరిచితం చేసిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా నొప్పిస్తే మన్నించాలన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడాన్ని నిషేధించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘కొందరు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే, ప్రైవేటుగా చేసే వైద్యమే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. కొందరు తాము పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రులకు పక్కనో, మరోచోటో ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. దాని వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందడం లేదు’ అని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయన విలేకర్లకు వివరించారు. ‘వైద్యుల నియామకానికి ప్రకటన జారీ చేసినప్పుడే వారికి జీతం, డీఏ, ఇతర భత్యాలు ఎంత వస్తాయో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుంది. అన్నింటికీ సిద్ధపడే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. తీరా చేరాక తగినంత జీతం రావడం లేదని, ప్రైవేటు ప్రాక్టీసు చేస్తామనడంలో అర్థం లేదు’ అని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌లో కేబినెట్‌ స్వల్ప సవరణ చేసిందని, కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట డివిజన్‌.. చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల డివిజన్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

"నవరత్నాల్లో ఒకటైన సున్నా వడ్డీ పథకం కొనసాగింపునకు నిర్ణయం. ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం రూ.1,250 కోట్లు విడుదల. సున్నా వడ్డీ పథకం నిధులు సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల. డ్వాక్రా మహిళల రుణంపై వడ్డీని వెనక్కి చెల్లించే కార్యక్రమం. ఈసారి 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి అదనంగా రూ.4 వేల కోట్లు రుణం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి ఆమోదం. ఉన్నత విద్యాశాఖలో 250 పోస్టులు మంజూరు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీ. ప్రకాశం జిల్లా దర్శి డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీ. కడపలో దంత వైద్య కళాశాలలో ప్రిన్సిపల్‌ పోస్టు మంజూరు." - పేర్ని నాని, మంత్రి

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలివీ..

  • రాష్ట్రంలో కొత్తగా 12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీసు సర్కిళ్ల ఏర్పాటు
  • 2021-22 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు ఆమోదం. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1,259 కోట్లు. ఏప్రిల్‌ 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు బదిలీ
  • జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లనే మిగిలిన కాలానికి కొనసాగించేలా పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం
  • చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 2022-23 నుంచి 2026-27 వరకు అమలు చేయనున్న మిల్లెట్‌ మిషన్‌కు ఆమోదం
  • ప్రభుత్వంలో విలీనం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్‌ న్యూమరరీ పోస్టులు. 23 ప్రిన్సిపల్‌, 31 బోధన, 199 బోధనేతర పోస్టుల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర
  • ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం
  • సర్వే సెటిల్‌మెంట్స్‌, భూరికార్డుల విభాగం పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం
  • ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు కర్నూలు జిల్లా బేతంచర్లలో 100 ఎకరాలు, కొలిమిగుండ్లలో 82.34, ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో 84.29 ఎకరాల కేటాయింపు.
  • నిజాంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో బురద పీతల హేచరీ ప్రాజెక్టు కోసం మత్స్యశాఖకు 280 ఎకరాలు
  • నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌కు 5.05 ఎకరాలు
  • అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో విండ్‌ టర్బైన్‌ జనరేటర్ల ఏర్పాటుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు 15 ఎకరాలు
  • కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విస్తరణకు 10.06 ఎకరాలు
  • రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ హబ్‌ల అభివృద్ధిలో భాగంగా కాకినాడ అర్బన్‌ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయింపు
  • కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో, రంపచోడవరం మండలం పెద గడ్డాడల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలల ఏర్పాటుకు 15 ఎకరాల చొప్పున కేటాయింపు
  • జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమర్థంగా పూర్తి చేశారంటూ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్‌, ఇతర అధికారుల్ని అభినందిస్తూ మంత్రిమండలి తీర్మానం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు..

  • చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యయసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ప్రకాశం జిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 బోధన, 10 బోధనేతర పోస్టుల మంజూరు.
  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 బోధన, 10 బోధనేతర పోస్టుల మంజూరు.
  • రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంలో హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి పర్యాటక శాఖకు 6 ఎకరాలు.
  • కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి ఏపీఎస్‌ఆర్టీసీకి 1.57 ఎకరాలు.
  • ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి.
  • ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు కర్నూలు జిల్లా కల్లూరులో 5 ఎకరాలు, విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాలు, అనంతపురం రూరల్‌లో 4, శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల కేటాయింపు
  • గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణకు 0.89 ఎకరాలు.

ఇదీ చదవండి: 24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్

Last Updated :Apr 8, 2022, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.