ETV Bharat / city

పాఠశాల విద్యలోనే ఇంటర్‌.. ఇకపై ప్లస్‌టూ స్కూళ్లు !

author img

By

Published : May 30, 2022, 4:22 AM IST

పాఠశాల విద్యలోనే ఇంటర్‌ను విలీనం చేసే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా.. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇది కార్యరూపంలోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.

పాఠశాల విద్యలోనే ఇంటర్‌
పాఠశాల విద్యలోనే ఇంటర్‌

పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేసేందుకు అధికారులు.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇది కార్యరూపంలోకి వస్తే 1971లో ఏర్పాటైన ఇంటర్ విద్యామండలి కనుమరుగు కానుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే.. రెండు శాఖల అధికారులు ఉంటారు. నూతన జాతీయ విద్యా విధానం 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున... ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటు న్నారు.

ఇంటర్మీడియట్లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి-NCERTలో విలీనం చేస్తారు. ఇంటర్ వృత్తి విద్యా కోర్సులను సమగ్రశిక్ష అభియాన్ నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో కలిపేస్తారు. పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు కలిపి.. కొత్తగా డైరెక్టర్ అకడమిక్, డైరెక్టర్ పరిపాలన, డైరెక్టర్ అకౌంట్స్ విభాగాలను ఏర్పాటు చేస్తారు. వీటి కిందికి 2 శాఖల్లోని వారిని తీసుకొస్తారు.

ఇంటర్ విద్యా మండలిలోని సిబ్బందిని ప్రభుత్వ పరీక్షల విభాగంలో విలీనం చేస్తారు. పది, ఇంటర్‌ పరీక్షలను ఈ బోర్డే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా 434 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 292 కళాశాలలను ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసి.. 'హైస్కూల్ ప్లస్'గా పిలుస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లకు అవకాశం ఇస్తారు. జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ పోస్టును జోనల్ పోస్టుగా మార్పు చేయనున్నారు. హైస్కూల్ ప్లస్ అర్హత కలిగిన ఉపాధ్యాయుల్ని పదోన్నతుల ద్వారా లెక్చరర్లుగా నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న జూనియర్ కళాశాలల్లో 90 శాతం నేరుగా నియామకాలు, 10 శాతం బోధనేతర సిబ్బందిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. హైస్కూల్ ప్లస్ ప్రాథమికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో హైస్కూల్ ప్లస్​ను ఎవరు పర్యవేక్షించాలనే అంశంపై నిర్ణయానికి రాలేదు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.