ETV Bharat / state

మహానాడు వేదికగా.. వైకాపా సర్కారును దునుమాడిన నేతలు

author img

By

Published : May 28, 2022, 8:51 PM IST

Updated : May 29, 2022, 5:10 AM IST

వైకాపా సర్కారును దునుమాడిన నేతలు
వైకాపా సర్కారును దునుమాడిన నేతలు

MAHANADU: ఒంగోలులో నిర్వహించిన తెదేపా మహానాడు వేదికా.. వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి.. ప్రజలకు ఊపిరి ఆడకుండా చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం భవిష్యత్ విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపూ లేదని.. కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు.

MAHANADU: జనంజనం కలిస్తే.. ప్రభంజనం అవుతుందని, ఈనాటి మహానాడు.. ఉప్పొంగిన సముద్రంలా కనిపిస్తోందని నందమూరి బాలకృష్ణ అన్నారు. శక పురుషుడి శత జయంతి రోజున మహానాడును ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ వచ్చేవారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ నమ్మారు. అందుకే ఎన్టీఆర్‌ పటాన్ని పూజగదిలో పెట్టుకుని ప్రజలు పూజిస్తున్నారు. పేదలు, సామాజిక సమస్యలు ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు తీశారు. రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. -నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే

నేడు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఊపిరి ఆడకుండా అన్నింటి రేట్లు పెంచిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌.. ఇలా అన్ని రేట్లను ఈ ప్రభుత్వం భారీగా పెంచి.. పేదవాడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఓటు వృథా చేయకు త్వరపడి.. ఓటును సవ్యంగా వేస్తేనే గుడి బడి అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగుతోందని విమర్శించారు. భావితరాల భవిష్యత్ కోసమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని.. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఉంటుందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

తెదేపా అధికారంలోకి వస్తేనే.. రాష్ట్రానికి బంగారు భవిష్యత్

వారంతా గాల్లో కలిశారు : తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెదేపా పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు శివారు మండువవారిపాలెంలో మహానాడు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేశ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పెట్రోల్, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోంది. ఇంకా రాష్ట్రం విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపూ లేదు. కేవలం మందు చూపు మాత్రమే ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా రాజకీయాలు చేస్తోంది. -నారా లోకేశ్ తెదేపా, జాతీయ ప్రధాన కార్యదర్శి

సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపూ లేదు. కేవలం మందు చూపు మాత్రమే ఉంది

160 స్థానాల్లో విజయం మనదే: మహనీయుడి పుట్టినరోజున మహానాడు జరుపుకుంటున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మహానాడు కార్యక్రమం జరగకుండా వైకాపా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని మండిపడ్డారు. సర్కారుకు చెంపదెబ్బ కొట్టినట్లు మహానాడుకు ప్రజలు తరలివచ్చారన్నారు. మూడేళ్లుగా తెదేపా కార్యకర్తలు బయటకు రావాలంటే, నాయకులు మాట్లాడాలంటే భయపడ్డారు. మహానాడు ప్రభంజనం చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో తెదేపా 160 స్థానాల్లో విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

2019లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే అంత ఈజీ కాదు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తేనే.. రాష్ట్రం గాడిన పడుతుంది. హత్యలు చేసిన వైకాపా నేతలు అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. - అచ్చెన్నాయుడు , తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

160 స్థానాల్లో విజయం మనదే

ఇంకా ఎవరేమన్నారంటే..

అవినీతి అనకొండను ఓడించడమే లక్ష్యం కావాలి: అవినీతి అనకొండను ఓడించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పిలుపునిచ్చారు. మహానాడు వేదికపై శనివారం ఆయన నివేదికను చదివి వినిపించారు. ‘అధికార పార్టీ కఠోర నిర్బంధాన్ని ఛేదిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్న అధినేతకు మహానాడు వేదికగా జేజేలు పలుకుతున్నాం. మీ కఠోర శ్రమకు సంపూర్ణ మద్దతునిస్తున్నాం. అలనాటి బాలచంద్రుల్లా నడుం బిగించి కార్యరంగంలో దూకుతాం. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. రాక్షస పాలనకు స్వస్తి పలుకుదాం’ అని పేర్కొన్నారు.

"వైకాపా నేతలు వస్తుంటే చీపుళ్లు తీస్తున్న మహిళలు: వైకాపా నాయకులు వస్తున్నారంటే.. ఏ గ్రామంలో చూసినా తలుపులు మూస్తున్నారు. ఆడవాళ్లు చీపుళ్లు తీసుకుని ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నవారి పరిస్థితి హీనంగా ఉంది. జగన్‌ వారి ముఖం చూడరు. పోలీసులు, అధికారుల్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడం తప్ప.. ఏమీ చేయడం లేదు. తెదేపా కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశమే." - భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి

ఇంత చెత్త సీఎంను భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు. ఇంత చెత్త పాలన అందించిన సీఎం ఎక్కడా లేరు. తన తల్లిని, చెల్లిని ఏడిపించిన జగన్‌కు వారి ఉసురు తగలక తప్పదు. జిల్లాల విభజన చేసి ప్రకాశం జిల్లాను జగన్‌ సర్వనాశనం చేశారు. జగన్‌ను మళ్లీ గెలిపిస్తే అందరూ వలసపోక తప్పదు. నేను హైదరాబాద్‌ వలసపోతాను. - ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే

"ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. లక్షలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేసిన తెదేపా కార్యకర్తలకు ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన లోకేశ్‌కు కృతజ్ఞతలు." - దామచర్ల సత్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

"సైకో చేతిలో చిత్తు కాగితంలా ఏపీ పరిస్థితి తయారైంది. మహానాడులో జనసందోహం చూసి మంత్రివర్గంలో కొంతమందికి కడుపు మండుతోంది. సభాపతి పదవిలో ఉన్నప్పుడు పార్టీల గురించి మాట్లాడకూడదు. అయినా మహానాడు వల్లకాడులా ఉందంటూ మాట్లాడుతున్నారు. గడప గడపకు వైకాపా అంటే తంతారని.. పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అని మార్చారు. సామాజిక న్యాయం పేరుతో అలీబాబా దొంగల యాత్ర చేస్తున్నారు." - వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు

"ఎన్ని అడ్డంకులు పెట్టినా మహానాడుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్‌.. మూడేళ్లుగా జనాన్ని మోసం చేస్తున్నారు. తెదేపా అధికారంలోకి రావడం ఖాయం." - గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే

"మహానాడు ప్రాంగణం వల్లకాడులా ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అంటారు.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని, మీ నాయకుడ్ని అదే వల్లకాడులో తగులబెడతారు. ఈ ముఖ్యమంత్రి, మంత్రులకు పాలన రాదు. అంతా కలిసి రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం తపించిన మహనీయుడు ఎన్టీఆర్‌. పదేళ్ల తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం." - చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

"ఎటు చూసినా జనం.. ఇదే తెలుగుదేశం ప్రభంజనం. మనం ఉమ్మితే ఏ పార్టీ అయినా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక విభిన్న పరిస్థితులు. తెలంగాణలో దొరల పాలన, ఆంధ్రలో దొంగల పాలన. మాకు సచివాలయం లేదు, మీకు రాజధాని లేదు. మా దగ్గర ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. మీ దగ్గర ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారు. తెలంగాణలో యువతకు గొర్లు కాసే పని.. ఆంధ్రలో జగన్‌రెడ్డి మటన్‌షాపుల ద్వారా గొర్లు కోసే పని ఇచ్చారు. అక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చాయి." - నర్సిరెడ్డి, తెలంగాణ నాయకుడు

నర్సిరెడ్డి చెప్పిన కథ: 'చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు అప్పుడప్పుడు పోయేది. జగన్‌ సీఎం అయ్యాక అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు రావడం లేదు. ఎందుకంటే 13 జిల్లాల్ని 26 చేశారు. జిల్లాలు పెరిగాయని కరెంటు రావడం లేదు’ అని నర్సిరెడ్డి విమర్శించారు. ‘నాలుగెకరాల భూమిలో నాట్లు వేసిన ఒకావిడ.. ఇటీవలే కుమారుడికి పెళ్లి చేసింది. శోభనం రోజున పెళ్లి కుమారుడు.. గదిలో అడుగుపెట్టగానే తల్లి రాములయ్యా కరెంటొచ్చింది జర మోటారు పెట్టిరాయ్యా.. అని పిలిచింది. కుమారుడు సైకిలేసుకుని పొలానికి పోయి మోటారు వేయగానే మళ్లీ కరెంటు పోయింది. అక్కడుండి ఏం చేస్తామని మళ్లీ ఇంటికొచ్చి గదిలోకి పోయాడు. అంతలోనే మళ్లీ తల్లి.. కరెంటొచ్చింది.. మోటారు వేసి రమ్మని పిలిచింది.. ఇలా ఉదయం వరకు వెళ్లి రావడమే సరిపోయింది. దీంతో పెళ్లి కుమార్తె.. రూ.6 లక్షలు ఇచ్చి చేసుకుంటే అటు ఇటు తిరుగుతున్నవ్‌.. అంటూ వదిలేసి పోయింది. దీంతో పెద్ద మనుషులు వెళ్లి మాట్లాడి.. పవర్‌ ప్రాబ్లమ్‌ పిల్లగానికి కాదు.. ప్రభుత్వానిదని వివరించారు. అందుకే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది' అని కథ చెప్పారు.

ఇదీ చదవండి:దిల్లీ పీఠాన్ని వణికించిన.. ఎన్టీఆర్ రాజకీయ ధీరత్వం!

Last Updated :May 29, 2022, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.