ETV Bharat / city

road accidents ప్రాణాలు తోడేస్తున్న అతివేగం

author img

By

Published : Sep 6, 2022, 10:40 AM IST

deaths in road accident అతి వేగం ప్రాణాలను తీస్తోంది. ఒకరి నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కడుపు కోత మిగులుతోంది. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు విగతజీవులవుతున్నారు. కొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. విజయవాడ నగరంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మద్యం మత్తులో వాహనాలను నడపడం, నిర్లక్ష్య డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక దిగువ వివరాలను వెల్లడించింది.

Increased road accidents
ప్రాణాలు తోడేస్తున్న అతివేగం

Increased road accidents ప్రమాదాలు అధికంగా ద్విచక్ర వాహనాల కారణంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత కార్లు, జీపుల వల్ల సంభవిస్తున్నాయి. రవాణా వాహనాలకు వెనుక వైపు రిఫ్లెక్టర్లు లేకపోవడం, అధిక బరువుతో వెళ్లడం, తదితర కారణాలతోనూ ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికుల వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించడం, సరకు తీసుకెళ్లే వాహనాల్లో జనాలను తీసుకెళ్లడం, అతి వేగంతో నడపడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ఒకే డ్రైవర్‌ ఎక్కువ దూరం నడపడం వల్ల అనర్థాలు సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 622 మంది గాయపడగా, 143 మంది చనిపోయారు. దాదాపు 90 ప్రమాదాలు మితిమీరిన వేగం కారణంగా జరుగుతున్నాయి. 1,101 ప్రమాదాలు అతి వేగంతోనే సంభవించాయి. దీని వల్ల 267 మంది చనిపోగా, 952 మంది క్షతగాత్రులయ్యారు. నిర్లక్ష్యంగా నడపడం, ఓవర్‌టేకింగ్‌ కారణంగా 124 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 20 మంది మృతి చెందగా, 129 మంది గాయాలతో బయటపడ్డారు.

పొగ మంచు, వర్షాలతో..

గత ఏడాది జరిగిన ప్రమాదాలు ఎక్కువగా చలికాలం, వర్షాకాలంలోనే సంభవించాయి. మంచు, వానలు పడే సమయంలో ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో చోటుచేసుకున్నాయి. వాతావరణం సాధారణంగా ఉన్న సమయంలో తక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయి. గత ఏడాది జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. డిసెంబరు నెలలో అత్యధికంగా 133 ఘటనలు జరిగాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో వందకు పైగానే ప్రమాదాలు జరిగాయి.

ప్రమాదాలు జరిగిన రోడ్లను చూస్తే.. ఎక్కువ ఘటనలు జాతీయ రహదారులపైనే చోటుచేసుకున్నాయి. ఎన్‌హెచ్‌లపై 623 ప్రమాదాలు జరిగాయి. 177 మంది చనిపోగా, 542 మంది గాయపడ్డారు. రాష్ట్ర రహదారులపై 74 ప్రమాదాలు చోటుచేసుకోగా, 56 మంది గాయపడ్డారు. 17 మంది మృతి చెందారు. ఇతర రోడ్లపై జరిగిన 531 ప్రమాదాల్లో 93 మంది ప్రాణాలు కోల్పోగా, 483 మంది గాయాలపాలయ్యారు.

24 % పెరుగుదల

విజయవాడ నగరంలో 2020తో పోలిస్తే 2021లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. 2020లో 991 నమోదు కాగా, 2021లో 1,228 ఘటనలు జరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే దాదాపు 24 శాతం మేర పెరుగుదల కనిపించింది. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. 2021లో మాత్రం ఆ సంఖ్య పెరిగింది. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 287 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1,081 మంది క్షతగాత్రులయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.