ETV Bharat / city

'ఏకాగ్రంగా కొలుచుకుంటే.. అనుగ్రహించే కరుణా సముద్రుడు'

author img

By

Published : Sep 10, 2021, 6:01 AM IST

ఆదిదేవుడు గణపతి... ఆదిదంపతుల తనయుడైన వినాయకుణ్ని సర్వ విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రతి కార్యారంభంలోనూ పూజించుకోవడం సంప్రదాయం. శివపార్వతీ సుతుడు అనడంలో వారిద్దరి తత్త్వాల ఏకస్వరూపం- అన్నది ఋషుల దర్శనం. ప్రకృతీ పురుషులైన గౌరీశంకరులు, తమ రూపమే అయిన ఓంకారాన్ని (ప్రణవాన్ని)ఉపాసించి పుత్రుడిగా పొందారని పురాణ కథనం.

వినాయకచవితి ప్రత్యేక కథనం
వినాయకచవితి ప్రత్యేక కథనం

పనులకు, సిద్ధికి ఆటంకాలే విఘ్నాలు, విపత్తులే విఘ్నాలు... అంటూ శాస్త్ర నిర్వచనం. ఆ విఘ్నాలను తొలగించే దైవంగా వినాయకుడిని కొలుచుకొంటారు. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడి సృష్టి రచనా మహాకార్యానికి విఘ్నాలు కలిగినప్పుడు, అవి తొలగడానికై ఓంకారాన్ని జపిస్తూ, ఆ ప్రణవ తేజస్సును ధ్యానించాడని, ఆ తేజస్సే గజవదనంతో వక్రతుండ స్వరూపంగా దివ్యాకారంతో సాక్షాత్కరించిందని స్కందపురాణంలో, తాపినీయోపనిషత్తులో వర్ణించారు.

తిరిగి ఆ తేజస్సే శివపార్వతీ తనయుడిగా వ్యక్తమైందని పురాణోక్తి. బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించినది మాఘ బహుళ చతుర్థినాడు. ఉమాశంకరులకు పుత్రుడై ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ చతుర్థి. అందుకే రెండు చవితి తిథులను గణేశ ఆరాధనకు ప్రశస్తంగా భావిస్తారు. ఈ గణపతిని పరిపూర్ణపరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించే యోగులు అత్యంత ప్రాచీన కాలంనుంచి ఉన్నారు. పురాణాలు, మంత్రశాస్త్రాలు వివిధ గణపతి మూర్తులు, మంత్రాల ఉపాసనా పద్ధతులను ఆవిష్కరించాయి. మహాగణపతి, బాలగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, హేరంబ గణపతి, ఉచ్చిష్ట గణపతి, లక్ష్మీ గణపతి, నృత్య గణపతి, క్షిప్ర గణపతి... అంటూ 16 గణపతి మూర్తులను, మంత్రాలను ఆగమాలు అందించాయి. వాటిని ఉపాసించే సిద్ధపురుషులు, యోగులు నేటికీ ఉన్నారు. కాశీక్షేత్రంలో 56 పేర్లతో 56 గణపతులు ఉన్నారు. ఆ వివరాల్ని స్కాందపురాణం వర్ణించింది.

అనేక పురాణాల్లో గణపతి వైభవాన్ని వ్యాసుడు వర్ణించాడు. ప్రత్యేకంగా ‘గణేశ పురాణం’ అనే ఉప పురాణాన్ని రచించాడు. బ్రహ్మదేవుడి ద్వారా ఉపదేశాన్ని పొంది, గణేశ మంత్రాన్ని జపించి, వివిధ గ్రంథ రచనా శక్తిని తాను పొందినట్లుగా ఆ పురాణంలో వ్యాసుడు వివరించాడు. ముద్గల మహర్షి గణేశుడికి సంబంధించిన ఎన్నో విషయాలను ‘ముద్గల పురాణం’ అనే బృహత్‌ గ్రంథంగా తీర్చిదిద్దాడు. గణేశ భక్తులకు అవి పరమ ప్రమాణాలు. గాణాపత్యానికి కేంద్ర పీఠాలుగా మహారాష్ట్రలోని అష్టగణపతి క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అవి పుణె పరిసరాల్లో నెలకొని ఉన్నాయి. ‘అష్ట వినాయక క్షేత్రయాత్ర’ పేరిట ప్రత్యేకంగా ఎందరో శ్రద్ధాళువులు వీటిని సందర్శిస్తుంటారు.

మహారాష్ట్రమంతా గణపతిని ప్రధానమైన దైవంగా భావిస్తూ, ఇతర దేవతల్నీ ఆరాధిస్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ... వివిధ గణపతి క్షేత్రాలకు, ఆరాధనా విధానాలకు ఆలవాలాలు. తెలుగునాట కూడా కాణిపాకం, అయినవిల్లి, బిక్కవోలు వంటి క్షేత్రాలు ప్రసిద్ధాలు. ఉత్తరాదిలో సైతం బహు వినాయక క్షేత్రాలు ప్రముఖంగా ఉన్నాయి. జ్ఞానానికి, బలానికి, ఐశ్వర్యానికి సంకేతమే గణేశమూర్తి. దేవతలకు సైతం పూజ్యుడైన ఈ దేవదేవుడు ఆచార్య(గురు) తేజంగా వేదాల్లో వినుతులందుకొన్నాడు.

ఎటువంటివారైనా ఏకాగ్రంగా కొలుచుకుంటే, అనుగ్రహించే కరుణా సముద్రుడు ఈ దైవం- అని ఋషులు, భక్తుల అనుభవాలు ప్రకటిస్తున్నాయి. ఆపదలను, ఆటంకాలను అవలీలగా నశింపజేసే మహాగణపతి కృపవల్ల దేశానికి, ప్రపంచానికి క్షేమం కలగాలని ప్రార్థిద్దాం.

ఇదీచదవండి.

GOVERNOR, CM WISHES: 'ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.