ETV Bharat / city

శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు?

author img

By

Published : Jul 21, 2022, 8:40 PM IST

Updated : Jul 22, 2022, 7:02 AM IST

‘అప్పుల విషయంలో శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? అది దేశం, ఇది రాష్ట్రం, అక్కడి పరిస్థితులు వేరు.. ఇక్కడివి వేరు. తెదేపా అధినేత చంద్రబాబు సహా అనేక మంది రాష్ట్రంపై దుష్ప్రచారం చేయడానికే అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారు. అప్పులు చేసిన, చేస్తున్న మాట వాస్తవమే. ఆ అప్పులతో ఏం చేస్తున్నామో చూడండి’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక వ్యవహారాల సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు.

ఏపీ గురించే మాట్లాడే ముందు మీ అప్పుల గురించి ప్రసావించండి
ఏపీ గురించే మాట్లాడే ముందు మీ అప్పుల గురించి ప్రసావించండి

‘అప్పుల విషయంలో శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? అది దేశం, ఇది రాష్ట్రం, అక్కడి పరిస్థితులు వేరు.. ఇక్కడివి వేరు. తెదేపా అధినేత చంద్రబాబు సహా అనేక మంది రాష్ట్రంపై దుష్ప్రచారం చేయడానికే అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారు. అప్పులు చేసిన, చేస్తున్న మాట వాస్తవమే. ఆ అప్పులతో ఏం చేస్తున్నామో చూడండి’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక వ్యవహారాల సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునేందుకు.. రుణాలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తదితరులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయ అంశాలపై సజ్జల, ఆర్థిక అంశాలపై దువ్వూరి కృష్ణ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.

వరద బాధితుల పరామర్శ ఇలాగేనా: సజ్జల
‘చంద్రబాబు వరద బాధితుల పరామర్శకు వెళ్లి అక్కడ శ్రీలంక అప్పులు, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఆయన బాధితులను చూడటానికి వెళ్లినట్లు లేదు. ఏదో ఉత్సవాలకు వెళ్లినట్లు జేజేలు కొట్టించుకుంటున్నారు. అక్కడా శ్రీలంక, రాష్ట్రంలో బడుల విలీనంపైనే మాట్లాడుతున్నారు. కేంద్రం ఒక ప్రకటన చేసేముందు ఆలోచించాలి. శ్రీలంకతో పోల్చే క్రమంలో వారు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పి ఉంటే బాగుండేది. ఇది పొలిటికల్‌ మిస్ఛిఫ్‌’ అని సజ్జల పేర్కొన్నారు. స్పిల్‌ వే నిర్మించకుండా ఎగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం నియమించిన డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ అనుమతులతోనే అలా చేశారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. వాళ్ల అనుమతులు లేవనుకుంటున్నానని సజ్జల చెప్పారు. పోలవరంలో ఏ పనైనా కేంద్ర జల సంఘం, డీడీఆర్‌పీ అనుమతితోనే చేశారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. స్పిల్‌ వే నిర్మించకుండా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాలని వారు అనుమతి ఇచ్చి ఉండరని, అలా ఇచ్చి ఉంటే చెవులు పట్టుకుని తప్పు అంగీకరిస్తామని సజ్జల వ్యాఖ్యానించారు.

కేంద్రం అప్పులు ఇంకా ఎక్కువ: దువ్వూరి
‘కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్రాల అప్పుల కన్నా ఎక్కువ ఉన్నాయి. 2021-22 చివరికి కేంద్రం అప్పులు రూ.1,35,88,193 కోట్లకు చేరుకున్నాయి. జీడీపీలో ఇది 57.42% ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది ఇంకా ఎక్కువగా 61% ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు తక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయిదేళ్లలో 143.25% మేర అప్పులు పెరగగా వైకాపా ప్రభుత్వంలో ప్రస్తుత మూడేళ్లలో 52.36 శాతమే పెరిగాయి. ప్రస్తుతం ఏపీకి రూ.4,98,799.25 కోట్ల అప్పులే ఉన్నాయి. రూ.8 లక్షల కోట్ల పైబడినట్లు కొందరు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు ఏటా 19.46% చొప్పున పెరిగాయి. ఈ ప్రభుత్వంలో 15.77% పెరుగుతున్నాయి. ప్రస్తుతం ద్రవ్యలోటూ తక్కువగానే ఉంది’ అని దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు.

విలేకరుల ప్రశ్నలు... సమాధానాలు

విలేకరులు: పెండింగు బిల్లులు ఎంతున్నాయి?
దువ్వూరి: అది ఏ రోజుకారోజు మారిపోతుంటుంది. చెప్పలేం.

విలేకరులు: ఒక నిర్దిష్ట సమయానికి ఇటీవల ఎంత పెండింగు బిల్లులు ఉన్నాయో చెప్పగలరు కదా?
దీనికి సరైన సమాధానం రాలేదు.

విలేకరులు: మీరు అప్పుల్లో బడ్జెటేతర రుణాలు కలిపి చెప్పడం లేదు. ఆర్థిక సంఘం ఆ మొత్తాలను పరిగణనలోకి తీసుకోవాలంటోంది.
దువ్వూరి: కొత్త అప్పులు తేల్చే క్రమంలోనే ఆ వివరాలు అడుగుతున్నారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 22, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.