ETV Bharat / city

పారదర్శకత అంటేనే గిట్టని పాలకులు.. పోర్టల్‌లో కనిపించని మెజారిటీ జీవోలు !

author img

By

Published : Jul 29, 2022, 4:52 AM IST

పారదర్శకత అంటేనే గిట్టనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పాలకులు.. గోప్యతకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మెజారిటీ జీవోల సమాచారం ఎవరికీ కనిపించడం లేదు. ఇ-గెజిట్‌ పోర్టల్‌లోనూ అరకొరగానే జీవోలు దర్శనమిస్తున్నాయి. హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా.. ప్రభుత్వ పోకడలో మార్పురావడం లేదు.

పోర్టల్‌లో కనిపించని మెజారిటీ జీవోలు
పోర్టల్‌లో కనిపించని మెజారిటీ జీవోలు

వైకాపా ప్రభుత్వానికి పారదర్శకత అంటే గిట్టదా? ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తెలియాల్సిన అవసరం లేదా? ప్రజలకు ఏమీ తెలియకుండా అంత గోప్యత ఎందుకు? ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసే విధాన నిర్ణయాలపై జారీచేసే జీవోల్ని ఇప్పటికీ అత్యంత రహస్యంగా ఉంచుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోల్ని ప్రభుత్వం ఇప్పటికీ దాచిపెడుతోంది. జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టడం దాదాపు ఏడాది క్రితం నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీన్ని హైకోర్టు తప్పుబట్టినా ప్రభుత్వానికి లెక్కలేదు. ఏపీ ఇ-గెజిట్‌ పోర్టల్‌లో అరకొరగా జీవోల్ని అప్‌లోడ్‌ చేసి మమ అనిపిస్తోంది. ప్రజలు ప్రశ్నిస్తారనో, కోర్టుకు వెళతారనో, తనకు ఇబ్బంది వస్తుందనో అనుకున్న ఏ జీవోనూ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచడం లేదు. బదిలీల జీవోల్లోనూ ఒకటీ అరా మాత్రమే ఆన్‌లైన్‌లో పెడుతోంది. ప్రస్తుతం ఏపీ ఇ-గెజిట్‌లో కూడా, ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం జారీ అయిన జీవోల్నీ... తీరిగ్గా దుమ్ముదులిపి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో పూర్తి భిన్నంగా జరుగుతోందని, రహస్య జీవోలే దానికి నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎవరెంత విమర్శించినా, విన్నవించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదు.

సంప్రదాయాన్ని వీడి దాపరికం: జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచడం 2008లోనే మొదలైంది. గత ప్రభుత్వాలు ప్రతి జీవోనీ ఆన్‌లైన్‌లో ఉంచేవి. ‘కాన్ఫిడెన్షియల్‌’ జీవోలైతే నంబరు మాత్రమే కనిపించేది. అలాంటివి అప్పుడప్పుడూ ఒకటో రెండో ఉండేవి. మిగిలినవన్నీ సాధారణ పౌరులకూ అందుబాటులోకి వచ్చేవి. జీవోల్ని అప్‌లోడ్‌ చేయడానికి సచివాలయంలో పటిష్ఠమైన వ్యవస్థ ఉండేది. ఏ ప్రభుత్వశాఖ జీవో జారీచేయాలన్నా... మొదట ఆన్‌లైన్‌ రిజిస్టర్‌లోకి వెళ్లి నంబరు తీసుకోవాలి. నంబరు వచ్చాకే జీవో జారీ చేయగలిగేవారు. దాన్ని ఐటీ విభాగం అప్‌లోడ్‌ చేసేది. ఒకసారి జీవో అప్‌లోడ్‌ అయితే... అందరికీ అందుబాటులోకి వచ్చేది. పాత జీవోలు కావాలన్నా వెళ్లి చూసుకునే వెసులుబాటు ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా... 2021 ఆగస్టు వరకు ఇదే విధానం కొనసాగింది. 2020లో 18,098 జీవోలు జీవోఐఆర్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. 2021 ఆగస్టు తర్వాతే జీవోఐఆర్‌లో జీవోలు పెట్టడం ఏకపక్షంగా మానేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో సీఎంవోలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించినట్టు చెబుతారు.

రహస్యాలు బయట పడతాయనే?: వైకాపా అధికారంలోకి వచ్చాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తమకు కావాల్సిన అధికారులు కోర్టు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా, వివాదాస్పద నేపథ్యం ఉన్నా అందలం ఎక్కించడం, నిబంధనలకు విరుద్ధంగా కీలక పదవుల్లో అస్మదీయుల నియామకం, దొడ్డిదారి పదోన్నతులు, నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తేవడం, ప్రభుత్వ కేసులు వాదిస్తున్న ప్రైవేటు న్యాయవాదులకు రూ.లక్షల్లో చెల్లింపుల వంటి నిర్ణయాలపై జీవోలు వచ్చినప్పుడు వాటిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేది. అలాంటి నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే, ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచేస్తే పోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవోల్నే అప్‌లోడ్‌ చేయడం మానేసిందన్న విమర్శలు ఉన్నాయి. 2021 ఆగస్టు మొదటివారంలో ప్రభుత్వం జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోల నంబర్లు మాత్రం ఉంచి... దానిలోని విషయం కనిపించకుండా చేసేది. అలా ‘బ్లాంక్‌’ జీవోల పరంపర కొన్నిరోజులు కొనసాగాక... ఆగస్టు 17 నుంచి అసలు జీవోల్నే ఆన్‌లైన్‌లో పెట్టడం మానేసింది.

కోర్టును మభ్యపెట్టేందుకు అరకొరగా..: కోర్టు స్పష్టంగా చెప్పినా జీవోలపై ప్రభుత్వం మొండివైఖరి వీడలేదు. ఇప్పటికీ తనకు నచ్చిన జీవోల్నే ఏపీ ఇ-గెజిట్‌ పోర్టల్‌లో పెడుతోంది. ఉదాహరణకు 28 మంది స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలనశాఖ బుధవారం జీవో నం.1490 జారీచేసింది. కానీ దాన్ని అప్‌లోడ్‌ చేయలేదు. చాలా సందర్భాల్లో ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఉత్తర్వులనూ ఆన్‌లైన్‌లో ఉంచడం లేదు. గతంలో ఐఏఎస్‌ అధికారులకు ఇంటి అద్దె భత్యం మంజూరు, ప్రభుత్వం తరఫున కేసులు వాదించిన న్యాయవాదులకు చేసిన చెల్లింపుల్లాంటి ఖర్చుల జీవోలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచడం వల్ల ప్రభుత్వం చేసే ఖర్చులపై అందరికీ స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడంతా రహస్యమే..!

గతంలో సాధారణ పనిదినాల్లో సగటున రోజుకు 60-70 జీవోలు అప్‌లోడ్‌ అయ్యేవి. ఇప్పుడు ఏపీ ఇ-గెజిట్‌లో రోజుకు సగటున 10 జీవోలు పెడితే గొప్ప. కొన్ని రోజుల్లో రెండు మూడే ఉంటాయి.

"భారత రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ ప్రకారం సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు కూడా అదే స్పష్టంచేసింది. ప్రభుత్వం జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచకపోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం. సాంకేతికత పెరిగేకొద్దీ పాలనలో మరింత పారదర్శకత తీసుకురావలసింది పోయి, ప్రభుత్వ రోజువారీ నిర్ణయాలకు సంబంధించిన జీవోల్ని బయటకు పెట్టడం లేదంటే ఇది ప్రజాస్వామ్య పాలన కానేకాదు. ముమ్మాటికీ రహస్య పాలనే. సమాచార హక్కు చట్టంలోని 6(1) సెక్షన్‌ ప్రకారం సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దేశభద్రత, ఆయుధాల కొనుగోలు లాంటి సమాచారం తప్ప.. దేన్నీ ప్రభుత్వం ‘కాన్ఫిడెన్షియల్‌’ అని దాచిపెట్టడానికి వీల్లేదు."- జడ శ్రావణ్‌కుమార్‌, హైకోర్టు న్యాయవాది

గోప్యత సరికాదని తప్పు పట్టినా..: జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టడం నిలిపివేయడంపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దానిపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. జీవోల గురించి తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు ఉందని తేల్చిచెప్పింది. ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న జీవోలను గోప్యంగా ఉంచడం సరికాదంది. జీతభత్యాలు, సాధారణ ఖర్చులు తదితర చిన్నచిన్న విషయాలకు సంబంధించిన జీవోలనే వెబ్‌సైట్లో ఉంచడం లేదన్న ప్రభుత్వ వాదనను తప్పుపట్టింది. చిన్న ఖర్చులని చెప్పడానికి కొలమానం ఏముంటుందని ప్రశ్నించింది. టీఏ, డీఏ బిల్లుల్లాంటి చిన్న మొత్తాల్లో అక్రమాలకు ఉద్యోగులు సస్పెండైన ఘటనలు ఉన్నాయని గుర్తుచేసింది. జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలు ఉంచకపోవడం, ఏపీ ఇ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో పరిమిత సంఖ్యలో జీవోలు ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై తుది విచారణ పెండింగ్‌లో ఉంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.