ETV Bharat / city

TTD: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి: హైకోర్టు

author img

By

Published : Jan 4, 2022, 3:23 PM IST

Updated : Jan 5, 2022, 4:20 AM IST

తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి
తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి

AP High Court On TTD Board Members: తితిదే బోర్డులో నేర చరిత్ర కలిగి ఉండి న్యాయస్థానం నోటీసులు తీసుకోని ముగ్గురు బోర్టు సభ్యుల పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. బోర్డులో నేర చరిత్ర ఉన్న 18 మంది సభ్యులుగా కొనసాగటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశిలిచ్చింది.

తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కోర్టు నోటీసులు అందుకోని ముగ్గురికి సాక్షి, ఈనాడు పత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న సభ్యులు కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

నేర చరిత్ర రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న 18 మందిని తితిదే పాలకమండలి సభ్యులుగా నియమించారంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్ రెడ్డి గతంలో పిల్ వేశారు. విచారణ జరిపిన కోర్టు 18 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనరు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ...అల్లూరి మల్లేశ్వరి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఎన్.శశిధర్​కు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయని, మిగిలిన వారికి నోటీసులు అందాయని వివరించారు.

తితిదే బోర్డు సభ్యులు వీరే..

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియను గతేడాది ప్రభుత్వం పూర్తి చేసింది. 24 మంది సభ్యులతో కూడిన తితిదే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసింది. తితిదే సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాటసాని రాం భూపాల్‌రెడ్డి(ఎమ్మెల్యే), టంగుటూరు మారుతి ప్రసాద్‌, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(ఎమ్మెల్యే), కలివేటి సంజీవయ్య(ఎమ్మెల్యే), డా.జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్‌రెడ్డి, బుదాటి లక్ష్మీనారాయణ, పార్థసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(ఎమ్మెల్యే), శ్రీనివాసన్, నందకుమార్‌, శశిధర్‌, విశ్వనాథ్‌రెడ్డి, మిలింద్‌, సౌరభ్‌, కేతన్‌ దేశాయ్‌, రాజేశ్‌ శర్మ, సనత్‌ కుమార్‌, అల్లూరు మల్లేశ్వరి, ఎస్‌.శంకర్‌ పాలకమండలిలో నియామకమయ్యారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి(దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, తితితే ఈవో నియామకమయ్యారు. తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ నియామకమయ్యారు.

వీరిలో 18 మందికి నేర చరిత్ర ఉందని.., వారు తితిదే బోర్డు సభ్యులుగా కొనసాగటానికి వీల్లేదని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి

Fake Tickets: శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు.. నలుగురిపై కేసు నమోదు

Last Updated :Jan 5, 2022, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.