ETV Bharat / city

పాదయాత్రకు గోదావరి వాసుల అపూర్వ మద్దతు.. జై అమరావతి అంటూ నినాదాలు

author img

By

Published : Oct 17, 2022, 9:06 PM IST

FARMERS PADAYATRA
FARMERS PADAYATRA

FARMERS PADAYATRA : గోదారి తీరాన జై అమరావతి నినాదాలతో రాజధాని రైతులు గర్జించారు. అశేష జనవాహిని పాదయాత్రకు మద్దతుగా రాగా.. గామన్ వంతెనపై కదం తొక్కారు. మండుటెండలో విరామం లేకుండా మనోసంకల్పంతో ముందుకు సాగారు. స్థానికుల ఆత్మీయ స్వాగతాలతో.. రెట్టించిన సమరోత్సాహంతో యాత్రను కొనసాగించారు.

AMARAVATI PADAYATRA : 36వ రోజున మహాపాదయాత్రకు కొవ్వూరు వాసులు వీడ్కోలు పలికితే రాజమహేంద్రవరం ప్రజలు.. రైతులకు స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. కొవ్వూరు నుంచి యాత్ర మెుదలుపెట్టిన అన్నదాతలకు.. మహిళలు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు, వివిధ, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి పాదం కలిపారు.

పశ్చిమగోదావరి వాసులు గామన్‌ వంతెన వరకూ వచ్చి అన్నదాతలకు వీడ్కోలు పలకగా, తూర్పుగోదారి ప్రజలు అపూర్వరీతిలో సాదరంగా ఆహ్వానించారు. స్థానికుల ఆత్మీయ మద్దతుతో ఎదురెండను సైతం లెక్కచేయక కర్షకులు 6కిలోమీటర్ల వంతెనపై విరామం లేకుండా ముందుకు సాగారు. వంతెనపై ఎక్కడా సేద తీరేందుకు, కాసేపు నిల్చునేందుకు అవకాశం లేకపోయినా.. వృద్ధులు, మహిళలు అంతా మొక్కవోని దీక్షతో కదం తొక్కారు. పడవలకు ఆకుపచ్చ జెండాలు కట్టి మత్స్యకారులు యాత్రకు సంఘీభావం తెలిపారు.

రాజమహేంద్రవరం మల్లయ్యపేట జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణులు నిరసన తెలపగా, జై అమరావతి అంటూ అన్నదాతలు ముందుకు సాగారు. పాదయాత్రలో నెక్కలు గ్రామానికి చెందిన 80 ఏళ్ల రాఘవమ్మ కిందపడటంతో ఆమె చెయ్యి విరిగింది. చేతికి గాయమైనా అరసవల్లి వరకు నడచి తీరుతానని చెప్పడం రైతుల సాధించబోయే విజయానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని రేపు రాజధాని రైతులు కలవనున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు కోరనున్నారు. స్థానికుల సంపూర్ణ మద్దతుతో ఉత్సాహంగా నడక సాగించిన రైతులు.. కాతేరు మీదుగా మల్లయ్యపేట వరకు 15 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు.

రైతుల పాదయాత్రకు గోదావరి వాసుల అపూర్వ మద్దతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.