Spices Park in Problems : దేశంలోనే అతిపెద్ద సుగంధద్రవ్యాల పార్కు మన రాష్ట్రంలో ఏర్పాటైంది. చెప్పుకోవాటానికి పరిమళాలు వెదజల్లుతున్నా.. మౌలిక వసతులు లేక విలవిలలాడుతోంది. 2015లోనే ఈ పార్కు ప్రారంభమైంది. కానీ.. ఇప్పటికీ సదుపాయలు కల్పించక పోవడంతో యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలు.. అవస్థలు పడాల్సిన పరిస్థితి. కీలకమైన జాతీయ రహదారి నుంచి అనుసంధాన రోడ్డు నిర్మించకపోవడంతో అనేక యూనిట్లలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలో 124ఎకరాల విస్తీర్ణంలో 2008లో సుగంధద్రవ్యాల పార్కుకు శంకుస్థాపన చేశారు. బాలారిష్టాలు దాటుకుని 2015లో ఈ పార్కు ప్రారంభించారు. అతిపెద్ద సుగంద ద్రవ్యాల పార్కుకు అనుసంధాన రహదారి నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. పార్కులో యూనిట్లు ఏర్పాటుచేసి ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలు.. ముడిసరకు, తయారీ ఉత్పత్తులను భారీ కంటైనర్లతో రవాణా చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుసంధాన రహదారి నిర్మాణం పూర్తికాక.. యూనిట్ల ఏర్పాటుకు యజమానులు ఆసక్తిచూపడం లేదు.
కోల్కతా-చెన్నై జాతీయరహదారిలో వంకాయలపాడు నుంచి సుగంధ ద్రవ్యాల పార్కుకు 2.5 కిలో మీటర్లు దూరం ఉన్న రహదారి.. ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉంది. భారీ వాహనాలు తిరగడానికి వీలుగా నాలుగు వరుసల రహదారిగా నిర్మించాలని నిర్ణయించి.. అప్పట్లో 6కోట్ల రూపాయలతో అంచనాలు తయారుచేశారు. ఇది పూర్తైతే జాతీయ రహదారి నుంచి భారీ వాహనాలు వెళ్లడానికి వీలవుతుంది. పార్కులో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాలకు రవాణా, నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ కంటైనర్లలో సరకు పోర్టుకు తరలించే క్రమంలో చిన్నరోడ్డులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి నిర్మిస్తే.. కంటైనర్లు నేరుగా పోర్టుకు తరలించే వెసులుబాటు కలుగుతుంది.
గుంటూరు జిల్లాతోపాటు పరిసరప్రాంతాల్లో మిర్చి, పసుపు, ధనియాలు, వాము, సిమ్ తులసి తదితర 12 రకాల సుగంధాలు సాగుచేస్తున్నారు. వీటిని శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధర రావడంతోపాటు.. వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తే వ్యాపారులకు.. రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. యూనిట్ల స్థాపనకు అన్ని అనుకూలతలు ఉన్నా అనుసంధాన రహదారి లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.
పార్కు ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్.. అనుసంధాన రహదారి నిర్మాణానికి అవసరమైన 6కోట్ల రూపాయలు మంజూరుచేస్తామని ప్రకటించారు. ఇక్కడ యూనిట్లు స్థాపించేవారికి ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లైనా హామీ అమలుకు నోచుకోలేదు.
ఇదీ చదవండి : Gravel excavations: అనుమతులు లేవు..అయినా తవ్వేస్తున్నారు...