ETV Bharat / city

రాష్ట్రంలో డీఏపీ కొరత తీర్చి రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ

author img

By

Published : Aug 29, 2022, 10:56 PM IST

LOKESH LETTER TO CM JAGAN
LOKESH LETTER TO CM JAGAN

LOKESH LETTER TO CM JAGAN రాష్ట్రంలో డీఏపీ కొరత తీర్చి రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా అవసరమైన ఎరువులు సకాలంలో లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సకాలంలో డీఏపీ అందుబాటులో లేక పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.

LOKESH LETTER TO CM: రాష్ట్రంలో డీఏపీ కొరత తీర్చి.. రైతులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటలకు అవసరమైన ఎరువులు సకాలంలో లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎరువుల నిల్వలు సరిపడినంత ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన ఎరువులు అరకొరగా లభిస్తున్నాయని విమర్శించారు. ఈ సీజన్​లో వరితో పాటు పత్తి, మొక్కజొన్న, మిరప, అపరాలు, మొదలగు పంటలు సాగు చేసిన రైతులకు డీఏపీ దొరక్క అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదన్న లోకేశ్​.. అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టిన రైతులు దారుణంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు 2.25 లక్షల టన్నుల డీఏపీని కేంద్రం రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. ఆగష్టు నెల వరకు రాష్ట్రానికి 81వేల టన్నుల డీఏపీ చేరాల్సి ఉంటే.. ఇప్పటి వరకు సగం కూడా చేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువులను విక్రయించే వారని.. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి తీసుకెళ్లేవారని పేర్కొన్నారు.

గతేడాది వ్యవసాయశాఖ వీటికి కేటాయింపులు తగ్గించిందని.. దీంతో అక్కడ ఎరువులు లభించడం లేదన్నారు. ఆర్బీకేల్లో ఆర్డర్ పెట్టి తెప్పించి ఇస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనని ఎద్దేవా చేశారు. మరోవైపు బహిరంగ మార్కెట్​లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముకుంటున్నా ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమని దుయ్యబట్టారు. డీఏపీ ఎమ్మార్పీ ధర రూ.1,350 ఉండగా..150 వరకు అధికంగా వసూలు చేస్తూ రైతుల్ని దోచుకుంటున్నారని.. దీనిని నియంత్రిచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

దుకాణాల్లో డీఏపీ బస్తా కొనాలంటే నానో యూరియా, ఇతర ఫోలియర్ స్ర్పేలు కొంటేనే డీఏపీ ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారని ఆరోపించారు. దీంతో రైతులు వాటి కోసం రూ. 300 వరకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇతర ఎరువుల ధరలు కూడా పెరగడంతో రైతులపై మోయలేని భారం పడుతోందని తెలిపారు. సగటున ఒక్కో ఎకరానికి 4వేల వరకు రైతులపై భారం పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సరిపడా డీఏపీ సహా ఇతర ఎరువుల నిల్వలు సరిపడా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొరతను నివారించాలని లేఖలో కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.