ETV Bharat / city

సీపీఎస్‌ రద్దు హామీ తొందరపాటన్న బొత్స.. జీపీఎస్​ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగులు

author img

By

Published : Sep 7, 2022, 7:05 PM IST

Updated : Sep 8, 2022, 6:26 AM IST

Ministers committee discussions on CPS: ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్​లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ

జీపీఎస్​ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగులు

Ministers committee discussions on CPS: సీపీఎస్‌ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీపీఎస్‌ రద్దుపై ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే తామేం చేయలేమని స్పష్టం చేశారు. సీపీఎస్‌ కంటే మెరుగ్గా గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)ను తీసుకొచ్చామని, దానిలోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలకు వెల్లడించారు. మంత్రుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తిరస్కరించారు. పాత పింఛను విధానమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే ముగిశాయి. సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ, జీఏడీ అధికారులు సమావేశమయ్యారు.

కనీస పింఛను రూ.10 వేలు

ప్రభుత్వం జీపీఎస్‌లో కొన్ని మార్పులు చేసి, సమావేశంలో ప్రతిపాదించింది. కనీస పింఛను, పదవీ విరమణ తర్వాత ఈహెచ్‌ఎస్‌ సదుపాయం, పింఛనుదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛను చెల్లింపులాంటి 5 అంశాలను కొత్తగా తీసుకొచ్చింది. జీపీఎస్‌లో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా అంగీకరించబోమనీ, ఓపీఎస్‌ ఇవ్వాల్సిందేననీ ఉద్యోగులు స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తే కేంద్రంతో ఇబ్బందులు వస్తాయని.. ఓపీఎస్‌ అమలు చేస్తున్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లు ఆరు నెలల్లో మళ్లీ వెనక్కి వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. సీపీఎస్‌, జీపీఎస్‌పైనే చర్చలు అని చెప్పడంతో ఏపీ ఐకాస అమరావతి, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్‌), సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (సీపీఎస్‌ఈఏ)లు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ నెల 11న నిర్వహించాల్సిన చలో విజయవాడను పోలీసుల నియంత్రణ కారణంగా వాయిదా వేస్తున్నట్లు సీపీఎస్‌ఈఏ వెల్లడించింది.

మరోసారి చర్చిస్తాం

‘జీపీఎస్‌లో ఉద్యోగి పదవీవిరమణ చేశాక గ్యారంటీ పింఛను కనీసం రూ.10 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగి, వారి జీవిత భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్‌కార్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పాం. ఉద్యోగి చనిపోయినా జీవిత భాగస్వామికి పింఛను సదుపాయాలు కల్పిస్తామనీ వివరించాం’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయినా జీపీఎస్‌కు అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు చెప్పాయని, మరోసారి వారితో చర్చిస్తామన్నారు. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని, తీవ్రమైన కేసులు పెట్టిన అంశాన్ని గురువారం సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతోనే సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు నిర్వహిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. జీపీఎస్‌లో కొత్తగా తెచ్చిన మార్పులను ఉద్యోగ సంఘాల నాయకులు పరిశీలించి, ఆమోదాన్ని తెలియజేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేస్తే రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్‌ అమలు చేస్తే బాధ్యతారాహిత్యమే అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకూ ప్రయోజనం ఉండేలా జీపీఎస్‌ తెచ్చామనీ, ఉద్యోగులకు ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.

సీఎం హామీ అమలు చేయాలని కోరాం

సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఓపీఎస్‌నే కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు. జీపీఎస్‌పై తొలి సమావేశంలో చెప్పిన వాటికి స్వల్ప మార్పులు చేసి, ప్రజంటేషన్‌ ఇచ్చారన్నారు. జీపీఎస్‌ అమలుకు అంగీకరించబోమని గతంలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపామని, సీఎం ఇచ్చిన రాజకీయ హామీ నెరవేర్చాలని కోరామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీపీఎస్‌ రద్దు కోసం ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతాయని యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సాయిశ్రీనివాస్‌, హృదయరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం మార్పు చేసి, ప్రతిపాదించిన జీపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సీపీఎస్‌ రద్దు అవుతుందనే వైకాపాను గెలిపించుకున్నామని సీపీఎస్‌ఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి చెప్పారు. దాని కోసం ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

జీపీఎస్‌లో ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలివీ..

* పదవీ విరమణ తర్వాత.. మూలవేతనం (బేసిక్‌పే)పై 33% గ్యారంటీ పింఛను

* పదేళ్లు సర్వీసున్న ఉద్యోగికి కనీసం రూ.10 వేల పింఛను

* పదవీ విరమణ తర్వాత ఉద్యోగి చనిపోతే గ్యారంటీ పింఛనులో భాగస్వామికి 60 శాతం పింఛను చెల్లింపు

* పదవీ విరమణ తర్వాత కూడా పింఛనుదారు, భాగస్వామికి ఈహెచ్‌ఎస్‌ పొడిగింపు

* సర్వీసులో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ చనిపోతే ఏపీజీఎల్‌ఐ, ఏపీజీఐఎస్‌ సదుపాయానికి అదనంగా ప్రమాద బీమా. మూలవేతనం రూ.25 వేలు ఉంటే రూ.50 లక్షలు, రూ.25 వేలు- రూ.50 వేలు ఉంటే రూ.40 లక్షలు, రూ.50 వేలు- రూ.75 వేలు ఉంటే రూ.30 లక్షలు, రూ.75 వేల పైన ఉంటే రూ.20 లక్షల ప్రమాద బీమా సదుపాయం.

ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చిస్తాం. సవరించిన జీపీఎస్‌పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తాం.. అసెంబ్లీలో చట్టం చేస్తాం.. సీపీఎస్ రద్దుపై మేం తొందరపడి హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో 95 శాతం హామీలు నెరవేర్చాం.. నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటి. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. తీవ్రమైన కేసులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం -బొత్స సత్యనారాయణ, మంత్రి

సమావేశానికి ముందు సీపీఎస్​పై మంత్రి బొత్స వ్యాఖ్యలు: సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చారని మంత్రి బొత్స అన్నారు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... భేటీలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పటివరకు జరిగిన భేటీలన్నీ అనధికారికమేనని పేర్కొన్నారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిగే సమావేశమే అధికారికమైందని స్పష్టం చేశారు. భేటీకి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించామన్నారు. భేటీకి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం.. భేటీకి రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు అనుకుంటామన్నారు. భేటీని ఉద్యోగ సంఘాలు బహిష్కరిస్తే ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 8, 2022, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.