ETV Bharat / city

AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..

author img

By

Published : Sep 7, 2022, 5:10 PM IST

Updated : Sep 8, 2022, 6:42 AM IST

AP Cabinet Decisions: వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల విడుదల సహా పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా 6 జిల్లాల్లో తాగునీరు అందించేందుకు.. 4020 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ డిక్లరేషన్ ర్యాటిఫికేషన్‌కు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది.

ap cabinet
ap cabinet

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4.72 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు, వారికి పాఠాలు బోధించే 50 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం రూ.670 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు కోసం నాబార్డు ద్వారా రూ.4,020 కోట్ల రుణం తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పథకాల అమలు కోసం ఏపీసీఆర్‌డీఏ, ఏపీఎంఆర్‌ అండ్‌ యూడీఏ చట్టాల్లో పలు సవరణలు చేయాలని నిర్ణయించి వాటికి ఆమోదం తెలిపింది. అమరావతిలో మొదటిదశ కింద చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పన పనులకు రూ.1,600 కోట్ల రుణం తీసుకోవటానికి ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్తు, పంప్డ్‌, హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-1996 చట్టం సవరణకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరులకు వివరించారు.

22న చేయూత పథకం నిధులు జమ

వరుసగా మూడో ఏడాదీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22న సీఎం జగన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు.

* గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులిస్తూ జారీచేసిన జీవో నంబర్‌ 6కు ఆమోదం.

* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుచేస్తూ ఇచ్చిన ఆదేశాల ర్యాటిఫికేషన్‌.

* నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21.30 లక్షల ఇళ్ల మంజూరు. గ్రేటర్‌ విశాఖలో లక్ష ఇళ్ల కేటాయింపుల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.8-15 లక్షల వరకూ లబ్ధి.

* అమ్మఒడి కింద డబ్బులు వద్దనుకుంటే గతంలో ల్యాప్‌టాప్‌ తీసుకొనేందుకు ఆప్షన్‌ ఉండేది. ఇప్పుడు ట్యాబ్‌ ఇస్తున్నందున ల్యాప్‌టాప్‌తో పనిలేదు.

* పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో ఉన్న మున్సిపల్‌ పాఠశాలలను, వాటి పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం.

కియా భూములకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు

ఏపీఐఐసీ, కియా మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భూకేటాయింపులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం.

అరబిందో రియాల్టీ.. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం

అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి 1,600 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం.

భావనపాడు పోర్టు పరిధి పెంపు

శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు పరిధి పెంపు. ఈ మేరకు ఇండియన్‌ పోర్ట్స్‌ చట్టం-1908 సవరణకు ఆమోదం. దీనివల్ల పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి. ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేసే సామర్థ్యం.

ఒబెరాయ్‌ గ్రూపునకు 30.32 ఎకరాల కేటాయింపు

* తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్‌ హోటళ్ల నిర్మాణానికి.. ఒబెరాయ్‌ గ్రూప్‌నకు 30.32 ఎకరాల భూములు మంజూరు చేయాలన్న నిర్ణయానికి.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 700 మెగావాట్ల సోలార్‌, 300 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు.. భూముల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

* యూనివర్సిటీలో అధ్యాపకుల కోసం నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్‌ కచ్చితంగా పాస్‌ కావాలన్న నిబంధనకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయంలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్‌ టీచింగ్ సిబ్బందిని అవుట్ సోర్సింగ్‌పై నియామకానికి నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో 85 మంది అదనపు సిబ్బంది పోస్టుల నియామకానికి ఆంగీకారం తెలిపింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని.. మంత్రివర్గం ఆమోదించింది.

* సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం తీసుకునేందుకు.. బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ యాక్ట్‌లోని 'ఒ' క్లాజ్‌లో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్​ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానున్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆజాదీ అమృతోత్సవాల్లో భాగంగా ఇప్పటికే క్షమాభిక్ష పెట్టిన 175 మంది ఖదీలకు అదనంగా.. మరో 20 మందికి క్షమాభిక్ష పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.

* ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌ల మంజూరును మంత్రివర్గం ఆమోదించింది. ఉపాధ్యాయులనూ కలిపి మొత్తం 5.27 లక్షల మందికి ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో బైజూస్ కంటెంట్‌, సాఫ్ట్‌వేర్లను జోడించి ఇవ్వనున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. 8, 9, 10 తరగతుల పిల్లలకు అమ్మఒడి పథకం యథాతథంగా కొనసాగుతుందన్న మంత్రి.. సీపీఎస్ రద్దు అంశం కేబినెట్‌లో చర్చకు రాలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 8, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.