ETV Bharat / city

తెలంగాణ దయాదాక్షిణ్యంపైనే కేంద్రం బతుకుతోంది: మంత్రి తలసాని

author img

By

Published : Feb 15, 2022, 1:10 PM IST

talasani
talasani

Minister Talasani Comments on BJP: ప్రధాని మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదని.. ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. తెలంగాణలో కాదు.. దేశంలోనే భాజపా గల్లంతయ్యే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.తెలంగాణకు, సికింద్రాబాద్​ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని డిమాండ్​ చేశారు.

Minister Talasani Comments on BJP: తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం నడుస్తోందని... ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. దేశంలో భాజపా గల్లంతయ్యే పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. పాకిస్థాన్​, మతం పేరుతో రెచ్చగొట్టడమే భాజపాకు తెలుసని విమర్శించారు.

తెలంగాణ దయాదాక్షిణ్యంపైనే కేంద్రం బతుకుతోంది: మంత్రి తలసాని

వారి కోసమే పని చేస్తోంది..

"రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తోంది. కానీ భాజపా మాత్రం పారిశ్రామికవేత్తల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోంది. మతం పేరుతో రెచ్చగొట్టడమే భాజపాకు తెలుసు. తెలంగాణ దయాదాక్షిణ్యంపైనే కేంద్రం బతుకుతుందన్న విషయం కేంద్రం మరిచిపోవద్దు. రాహుల్​ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యల పట్ల కేసీఆర్​ స్పందిస్తే.. కాంగ్రెస్​తో తెరాస కలిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నా రు." -తలసాని శ్రీనివాస్​ యాదవ్​, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి

స్పందిస్తే కలిసిపోయినట్లా.?

రాజకీయాల కోసం భాజపా.. సర్జికల్ స్ట్రైక్, పుల్వామా, రావత్ వంటి అంశాలను వాడుకోవడం సిగ్గు చేటని మంత్రి తలసాని అన్నారు. ఆర్మీని రాజకీయాల కోసం వాడుకునే ఏకైక పార్టీ భాజపా అని దుయ్యబట్టారు. కేసీఆర్ రఫేల్ ఒప్పందంలో అవినీతిపై మాట్లాడితే... దానికి సైనికులకు సంబంధమేంటని తలసాని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలపై స్పందించి అసోం సీఎంతో రాజీనామా చేయించకుండా.. కాంగ్రెస్​తో తెరాస మిలాఖత్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అసోం ముఖ్యమంత్రి సంబోధించిన అంశాలను భాజపాపై ప్రయోగిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇక.. రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్​ ట్వీట్​పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు తలసాని. ఆయన ఇన్​ఛార్జి అయ్యాక.. కాంగ్రెస్​ డిపాజిట్​ కూడా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడతారా అని వ్యాఖ్యానించారు.

కిషన్​ రెడ్డికి సవాల్​

కేంద్రం.. రైతుల నడ్డి విరిచిందని.. ఇప్పుడు కొత్తగా విద్యుత్​ సంస్కరణలు తెస్తోందని తలసాని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా, తెరాస కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్రానికి తామిచ్చిన లెక్క చెప్తామని.. తెలంగాణకు, సికింద్రాబాద్​ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. కిషన్ రెడ్డి యుద్ధం చేస్తారో.. హైదరాబాద్​లో తిరగడం మరిచిపోతారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

మోదీ రావడమే తప్పు

సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోదీ రావడమే తప్పని తలసాని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఓటమి తప్పదని సంకేతాలు రావడంతోనే కాశీ, అయోధ్య, ముచ్చింతల్​లో నరేంద్రమోదీ నాటకాలు నడిపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు.

ఇదీ చదవండి: Kavitha Tweet: 'తెలంగాణ ఎవరి భిక్షా కాదు'.. మాణిక్కం ఠాగూర్​కు కవిత కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.