Kolagatla: బయట రాజకీయవేత్తనే: ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి

author img

By

Published : Sep 20, 2022, 11:34 AM IST

Kolagatla Veerabhadraswamy

Kolagatla Veerabhadraswamy: బయట రాజకీయవేత్తనేనని ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సభలో పక్షపాతం లేకుండా ఉంటానని వెల్లడించారు. సభా గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Kolagatla Veerabhadraswamy: సభా గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తదితరులు సాదరంగా తీసుకువెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ‘సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తుంటారు. సభ గౌరవాన్ని పెంపొందించేలా ప్రవర్తించాలి’ అని సూచించారు.

‘సభలో ఉన్నంతవరకూ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉంటా.. కానీ వైకాపా టికెట్‌ ఇవ్వబట్టే గెలిచి ఈ స్థానానికి వచ్చా కాబట్టి బయట రాజకీయవేత్తగానే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. ఎడమవైపు (ప్రతిపక్షం) చూడాలంటే.. సభ ఆసాంతం తమ స్థానాల్లో కూర్చుంటేనే చూడగలుగుతాం’ అని పేర్కొన్నారు. ‘సోమన్న అని పిలిచే వీరభద్రస్వామిని ఉపసభాపతి స్థానంలో కూర్చోపెట్టడం సంతోషాన్నిస్తోంది. ఆయన సభలో అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

‘ఈ రోజు నుంచి మీకు పార్టీతో సంబంధం లేదని భావిస్తున్నా. అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూసి.. ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చూస్తే సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వారికి ఉండాలి’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘గౌరవ సభాపతి కుడిచేతి వైపు (అధికార పక్షం) చూస్తారు తప్ప, ఎడమచేతి వైపు (ప్రతిపక్షం వైపు) చూడరు.

కనీసం మీరైనా ఎక్కువ సమయం ఇటు చూసి అవకాశమిస్తే ఈ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతాం. ప్రభుత్వం వాటిని చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది’ అని సూచించారు. పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు మాట్లాడుతూ, సభాపతి, ఉపసభాపతి పదవులు రెండింటినీ సీఎం జగన్‌ ఉత్తరాంధ్రకే ఇవ్వడం తమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.