CM Jagan: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్​

author img

By

Published : Sep 19, 2022, 9:07 PM IST

Updated : Sep 20, 2022, 9:51 AM IST

cm jagan

CM Jagan on Polavaram: ముఖ్యమంత్రి జగన్‌.. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చేసిన విశ్లేషణ.. విస్తుగొలిపేలా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమంటూ వైఫల్యాలను తెలుగుదేశం సర్కారుకు అంటగట్టేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ తటస్థ వ్యక్తిని అడిగినా.. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇలా అయిందో చెబుతారని సీఎం వాదించారు. అయితే ఇప్పటికే తటస్థ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన పక్కన పెట్టేశారు. చంద్రబాబుపైనే మళ్లీ మళ్లీ నిందలు మోపుతున్నారు. కానీ కేంద్రం నియమించిన హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం.. వైకాపా ప్రభుత్వ హయాంలోనే 2021 నవంబరులో పోలవరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చింది..? మరి ఆ తటస్థ బృందం చెప్పిందేంటి..? ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి కారణాలెంటో ఓసారి చూద్దాం.

CM Jagan Comments on Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు, నదీ గర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదని.. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇది పూర్తిగా మానవ వైఫల్యమేనని...ఎగువ కాఫర్‌ డ్యాంలో పడ్డ గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. అసమర్థ ప్రణాళిక వల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది అని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల నివేదిక స్పష్టం చేసింది. మరి సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చనిది ఈ ప్రభుత్వమేనన్న విషయం సీఎంకు తెలియనిది కాదు. అయినప్పటికీ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు

స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు కట్టడం వల్లే పోలవరం నాశనమయిందని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఏ నీటిపారుదల ప్రాజెక్టుకైనా కేంద్ర జలసంఘమే కీలకం. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన సంస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ..! వారి ఆమోదం లేకుండానే ఈ నిర్మాణాలు పాత ప్రభుత్వం చేసిందని నిరూపించగలరా? రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి.

స్పిల్‌వే పూర్తి చేయకముందే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ కమిటీలు అనుమతులు ఇవ్వలేదు, సంతకాలు చేయలేదు అని ఉంటే ఆ కాగితాలు ప్రదర్శించవచ్చు కదా..! స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండా మిగిలినవి నిర్మించడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఇలా అయిందని... కేంద్ర జలసంఘం కానీ, పోలవరం అథారిటీ కానీ, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ కానీ... పేర్కొన్న కాగితాలు ప్రభుత్వం వద్ద ఏమైనా ఉన్నాయా? ఉంటే శాసనసభలో చూపించవచ్చు కదా అన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శాసనసభలో మాట్లాడిన సీఎం... పోలవరంలో మొదట స్పిల్‌వే నిర్మించాలన్నారు. ఆ తర్వాత డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించాలని చెప్పారు. అవన్నీ పూర్తయ్యాకే ప్రధాన డ్యాం కట్టాలన్నారు. చంద్రబాబు స్పిల్‌వే, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి చేయకుండా 2.1 కిలోమీటర్ల ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం మొదలుపెట్టారని... దాన్నీపూర్తి చేయలేదని సీఎం అన్నారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్‌ వదిలిపెట్టారని పేర్కొన్నారు. దిగువ కాఫర్‌ డ్యాంలో రెండు గ్యాప్‌లు వదిలిపెట్టారని చెప్పారు. వరద నీరు 2.1 కిలోమీటర్ల పొడవునా వెళ్లాల్సి ఉందని... అలా వెళ్లకుండా ఎగువ కాఫర్‌ డ్యాంలో వదిలిన గ్యాప్‌ల గుండా వెళ్లిందని అన్నారు. 2.1 కిలోమీటర్ల పొడవునా పోవాల్సిన నీరు ఈ రెండు గ్యాప్‌ల నుంచి వెళ్లాల్సి వచ్చేసరికి నదిలో ప్రధాన డ్యాం నిర్మించాల్సినచోట కోతపడిందని సీఎం అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మీకు ఇష్టమొచ్చిన తటస్థ వ్యక్తిని అడగండి.. ఈ తప్పును చెబుతారని సీఎం అన్నారు.

కానీ వాస్తవం సీఎం మాటలకు విరుద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందు కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతులు తీసుకోవాలి. డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభించే క్రమంలో ముందే ఆ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. పనులు జరుగుతుండగా ఆ కమిటీలు అనేకసార్లు వచ్చి పరిశీలించి వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2021 వరకు జరిగిన పరిణామాలపై మూడో పక్షంగా కేంద్రం హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించింది. వారు అనేకసార్లు పోలవరాన్ని సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణాలను విశ్లేషించారు. పోలవరంలో ఈ కోతకు కాఫర్‌ డ్యాం ముందే నిర్మించడం కారణమని.. వారు చెప్పలేదు. 2019 మేలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే ఈ విధ్వంసం జరిగిందని తేల్చిచెప్పారు. 2020లో గోదావరికి భారీ వరదలు రాగా... 22 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలతో కాఫర్‌ డ్యాం దిగువన, ప్రధాన డ్యాం గ్యాప్‌ 1, 2 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక కోత పడింది. మూడుచోట్ల నదీ గర్భం కోసుకుపోయింది. అయినప్పటికీ ఈ అంశాన్ని మానవ నియంత్రణలో లేని అంశాల కేటగిరీలో చేర్చలేమన్న హైదరాబాద్‌ ఐఐటీ... ప్రకృతి వైఫల్యంగానూ చూడలేమంది. అసమర్థ ప్రణాళికే ఈ విధ్వంసానికి కారణంగా పేర్కొంది. కాఫర్‌ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేకపోయినందున... ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి ఇది ప్రధాన కారణమైనట్లు తెలిపింది.

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చాల్సింది ఎవరు? కేవలం 380 మీటర్ల గ్యాప్‌ ఒక చోట, 300 మీటర్ల గ్యాప్‌ మరో చోట పూడ్చి ఆ మేరకు పునరావాసం పూర్తి చేసి ఉంటే ఇంత విధ్వంసం జరిగేదా? ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే ఈ తప్పు జరిగిందని తటస్థ నిపుణులే తేల్చారు కదా.. ఈ వైఫల్యం ప్రభుత్వానిది కాదా? 2019 మే నెలలో పోలవరం అథారిటీ సమావేశం జరిగింది. అప్పుడు ఆ గ్యాప్‌లు అలా వదిలేయాలని చెప్పింది. ఆ తర్వాత వరదలు వచ్చి వెళ్లాయి. 2019 వరదల్లో ఆ గ్యాప్‌ల ద్వారా నీళ్లు ప్రవహించినా ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో ఏమీ కోతపడలేదు. 2020లో వరదలొచ్చే సమయానికి 8 నెలలు పనులు చేసుకునేందుకు వీలుంది. ఆ సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చి పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్‌ ప్రభుత్వానిది కాదా? అంటే… ఎదురుదాడి చేస్తున్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చేసరికి అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి కాలేదన్న సీఎం... తాము వచ్చాకే పనులు మొదలుపెట్టి చేశామన్నారు. 2021 జూన్‌ నాటికి అప్రోచ్‌ ఛానల్‌లోకి నీళ్లు మళ్లించామని.. 2022 మార్చి నాటికి అప్రోచ్‌ ఛానల్‌ పూర్తయిందని చెప్పారు. డ్యాం పూర్తి చేసి, స్పిల్‌వే గేట్లు కూడా పెట్టామని... ఇప్పుడు నీళ్లు కిందకు వస్తున్నాయని సీఎం అన్నారు. 2022 జూన్‌ నాటికి చంద్రబాబు ప్రభుత్వం వదిలేసిన పనులను పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి చేశామని సీఎం చెప్పారు కానీ.. వాస్తవానికి ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఇంకా 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వాల్సి ఉంది. సులువుగా జరిగే మట్టి తవ్వకం పనులూ చేయలేదు. 2019లో జగన్‌ తొలి సమీక్ష ప్రకారం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం పనులు 64.08 శాతం జరిగాయి. తాజా నివేదికల ప్రకారం 76 శాతం పూర్తయ్యాయి. మూడేళ్లలో 12 శాతం పనులు చేయడాన్ని గణనీయమైన ప్రగతి అంటారా?అంటే సమాధానం లేదు.

ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తయింది.. దిగువ కాఫర్‌ డ్యాం 30.5 మీటర్లు ఎత్తు పెంచాల్సిన చోట అనుకున్న మేర పని జరగలేదని సీఎం అన్నారు. అనుకున్నదాని కన్నా ఎక్కువ వరద రావడం, డిజైన్లకు అనుమతి రాకపోవడంతో ఆలస్యమయిందని చెప్పారు. 21 నుంచి 23 మీటర్ల ఎత్తు వరకు దిగువ కాఫర్‌ డ్యాం నిర్మించగలిగామని... వరదలు తగ్గిన తర్వాత యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు నవంబరులో ప్రారంభమవుతాయని వివరించారు. మరి.. సరైన సమయంలో దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పు పట్టిన మాట వాస్తవం కాదా? 2022 జులై 22న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి... జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు ఈ విషయాలతో లేఖ రాయలేదా? ఆ లేఖలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను తప్పు పట్టలేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా? అంటే వీటికి మాత్రం సమాధానాలు దొరకవు.

పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరుకు నీటి నిల్వ చేస్తే 20 వేల 946 కుటుంబాలు నిర్వాసితులవుతాయని... వీరిలో 14 వేల 110 కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని సీఎం జగన్‌ అన్నారు. ఇందుకు 19 వందల 60.95 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని... 2022 అక్టోబరులోగా మిగిలిన నిర్వాసిత కుటుంబాలకూ పునరావాసం పూర్తి చేస్తామని చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ తాజా లెక్కల ప్రకారం ఇంత వరకు 9 వేల 299 మందిని మాత్రమే తరలించారు. ఇంకా 9 వేల 390 మందిని తరలించాల్సి ఉంది. ఇందుకు ఇంకా 2 వేల 173.61 కోట్ల రూపాయలు అవసరం. నిజానికి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం 41.15 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి ముందే వీరందరికీ పునరావాసం కల్పించాలి. వైకాపా ప్రభుత్వం ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేశామని ఘనంగా చెబుతోంది. కానీ ఇన్ని వేల కుటుంబాలకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2021, 2022 వరదలకు నిర్వాసితులు పడ్డ కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి అంటే ఇదీ అని శాసనసభలో ఘనంగా చెప్పిన ముఖ్యమంత్రి... కనీసం తొలిదశ పునరావాసం పూర్తి చేయలేకపోయారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 20, 2022, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.