ETV Bharat / city

రేషన్‌ బండ్లతో సరఫరాకు ప్రజాధనం వృథా కాదా?.. తెచ్చుకోలేని స్థితిలో పేదలున్నారా?

author img

By

Published : Jul 19, 2022, 7:27 AM IST

High court on ration: వాహనాల ద్వారా సరఫరాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.... రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం.... పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలను కాదని వాహనాల ద్వారా ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా డోర్‌ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ చర్య ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిలదీసింది. న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

High court on ration
హైకోర్టు

High court on ration: పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కి.మీ. దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం.. పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలను కాదని వాహనాల ద్వారా ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వీలు కుదిరినప్పుడు అరగంట సమయం కేటాయించి కి.మీ. దూరంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి రేషన్‌ సరకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరని తెలిపింది. సరకులు పంపిణీ చేసినందుకు రేషను డీలరుకు ఇచ్చే కమీషన్‌తో పోలిస్తే.. వాహనాల ద్వారా డోర్‌ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ చర్య ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిలదీసింది. అలా వృథా చేసే సొమ్ముతో పేదప్రజలకు మరిన్ని సరకులు అందించొచ్చని అభిప్రాయపడింది.

సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు అనుమతి తీసుకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించారో చెప్పాలంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

ఉద్దేశం నెరవేరడం లేదు: న్యాయమూర్తి

ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని వేచి చూడాల్సి వస్తుందన్నారు. పథకం అమలు కోసం 92 వేల మందిని నియమించారని, వాహనదారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారన్నారు. వాహనాలు కొనడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి ప్రాంతాల్లో వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేస్తే అర్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.రేషను బండ్ల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీ ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని ఏజీ శ్రీరామ్‌ చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయడానికి గడువు కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.