ETV Bharat / city

అమరావతిలో వేరేవారికి ఇళ్లస్థలాల కేటాయింపుపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 29, 2022, 4:36 PM IST

Updated : Aug 30, 2022, 6:42 AM IST

HIGHCOURT ON RAJADHANI HOUSES
HIGHCOURT ON RAJADHANI HOUSES

HIGH COURT అమరావతిలో వేరేవారికి ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులేషన్స్‌, సీఆర్‌డీఏ భూ కేటాయింపుల విధానానికి విరుద్ధంగా స్థలాలు కేటాయిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంద్రనీల్​ త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

High Court on Houses in Capital: రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలాల కేటాయింపునకు వీలుగా 2020లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా పడింది. రైతులు కొందరు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేసిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలాలు కేటాయించేందుకు వీలుగా 2020 ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 107ను సవాలు చేస్తూ రైతు ఎ.నందకిశోర్‌, జి.హరిగోవింద ప్రసాద్‌, కొల్లి సాంబశివరావు తదితరులు అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం.. జీవో 107 అమలును నిలిపివేసింది. రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జోనల్‌ రెగ్యులేషన్‌ విధానానికి, సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది

అది నా పరిధికి మించిన వ్యవహారం: అదనపు ఏజీ

ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించేందుకు సిద్ధపడుతుండగా.. ఎస్‌ఎల్‌పీ పెండింగ్‌ కారణంగా అక్టోబర్‌ 21కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. విచారణను రెండు వారాలు వాయిదా వేయాలని, 50 వేల మందికి ఇళ్ల స్థలాల పంపిణి నిలిచిపోయిందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరారు. అందుకు త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయబోతున్నారా? ఔనని సమాధానం ఇస్తే ఆ వివరాలను నమోదు చేసి మీరు కోరినట్లు వ్యాజ్యాలపై విచారణను త్వరగా జరుపుతామని వ్యాఖ్యానించింది. అది నా పరిధికి మించిన వ్యవహారమని అదనపు ఏజీ బదులిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 30, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.