Corona Vaccination In Telangana: రాష్ట్రంలో టార్గెటెడ్ జనాభాలో 100 శాతం మందికి కొవిడ్ టీకా తొలిడోస్ పూర్తయినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. హైటెక్స్లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో పాల్గొన్న ఆయన... ఈ మేరకు ప్రకటించారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది 18 ఏళ్లు పూర్తిచేసుకొని.. కొవిడ్ టీకా తీసుకొనేందుకు అర్హులు కాగా.. 100 శాతం మందికి తొలిడోస్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెప్పారు. 61 శాతం మందికి రెండో డోస్ పూర్తియినట్లు చెప్పారు.
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డిలో 113 % వాక్సినేషన్ పూర్తి అయిందని మంత్రి చెప్పారు. తర్వాత స్థానాల్లో 110 శాతంతో హైదరాబాద్, 104 శాతంతో మెదక్ జిల్లాలు ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాల నుంచి రంగారెడ్డికి వచ్చిన వారికీ ఇక్కడే కరోనా టీకాలు వేసినట్లు చెప్పారు. అందువల్లనే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా టీకా పంపిణీ జరిగినట్లు చెప్పారు.