ETV Bharat / city

హైదరాబాద్ పరువు హత్య : ఇక్కడ చంపేసి.. కర్నాటకలో దాక్కున్నారు!

author img

By

Published : May 21, 2022, 9:31 AM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోని బేగం బజార్​లో నిన్న జరిగిన పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందుతుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కర్నాటకలో ఉన్నారని గుర్తించిన పోలీసులు.. అక్కడికెళ్లి పట్టుకున్నారు.

begumbazar honor killing
begumbazar honor killing

begumbazar honor killing : హైదరాబాద్‌ బేగంబజార్‌ పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజన బాబాయి కుమారులు స్నేహితులతో కలిసి నీరజ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య తర్వాత కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకలోని గుర్‌మిత్కల్‌లో నిందితులను పట్టుకున్నారు.

హైదరాబాద్ పరువు హత్య కేసులో.. నలుగురు అరెస్ట్

మరో 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా... నీరజ్‌ను బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నిన్న హత్య చేశారు. కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో యువతి కుటుంబీకులు కక్షగట్టారని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే.. అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపగా 'నీరజ్‌-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.

దారుణంగా హత్య: కొన్ని రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.