ETV Bharat / city

RS PRAVEEN KUMAR: 'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'

author img

By

Published : Aug 8, 2021, 10:44 PM IST

'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'
'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'

రానున్న ఎన్నికల్లో బహుజన్​ సమాజ్ పార్టీ రాజ్యాధికారంలోకి వస్తుందని.. మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపాలు బీసీలను మోసం చేస్తున్నాయని.. పథకాలతో తెరాస మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలోని నల్గొండ నిర్వహించిన సభలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్​కుమార్... పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తనను రాష్ట్ర కో-ఆర్డినేటర్​గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

తాము బానిసలం కాదు.. పాలకులమని.. బీఎస్పీలో చేరిన సందర్భంగా తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పష్టం చేశారు. ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజని అన్నారు. రాజీనామా నిర్ణయం తన తల్లితో చెప్పినప్పుడు..' మన కుటుంబంలోనే చాలా మంది కూలీ పనులు చేస్తున్నారని.. నువ్వు ఒక్కడివే ఐపీఎస్​వు ఉన్నావని చెప్పుకుంటున్నాం. నీ ఒక్కడి వల్ల మార్పు వస్తుందా' అని ప్రశ్నించిందని ప్రవీణ్ ​కుమార్​ చెప్పారు. తాను ఒక్కడినే కాదని.. ఎందరో ప్రవీణ్ ​కుమార్​లు ఉన్నారని చెప్పానని తెలిపారు. తానొక్కడినే సంతోషపడితేకాదు.. తనలాంటి వాళ్లు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నట్లు తన తల్లితో చెప్పానన్నారు.

తెలంగాణలోని నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీ కండువా కప్పి.. సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటించారు. సుమారు 1,300 మంది ఆత్మహత్య చేసుకున్న స్థూపం వద్ద నివాళులు అర్పించి వచ్చానని.. ఎన్ని కుట్రలు చేసినా తమ బిడ్డలు ఆగరని.. ప్రగతిభవన్​కు తప్పనిసరిగా పోదామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. లక్షలాది ప్రవీణ్​కుమార్​ల బతుకులు మార్చేందుకు... రెక్కాడితేకానీ డొక్కాడని వారి జీవితాలు బాగు చేసేందుకు తాను ఐపీఎస్​ పదవిని వదులుకున్నానని అన్నారు.

'అయ్యా సీఎంగారూ.. మీరు దళిత బంధు కోసం రూ.1,000 కోట్లు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? మా గిరిజన, ఆదివాసీ బిడ్డలు వ్యవసాయం చేసిన డబ్బులు, ఆదివాసి బిడ్డలు తేనె అమ్మిన సొమ్ములు, మా నేత కార్మికులు మగ్గాలు నేసి తీసుకొచ్చిన డబ్బులు.. మీరు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. నిజంగా మీకు ప్రేముంటే.. మీ ఆస్తులమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే, నాణ్యమైన విద్య, వైద్యం కావాలి. మీరు 1,000 గురుకులాలు పెట్టి.. మొత్తం మారిపోయిందని చెబుతున్నారు. గురుకులాల్లో కేవలం నాలుగు లక్షల మందే చదువుతున్నారు. దాంతో ఏ రకంగా బంగారు తెలంగాణ సాధ్యమో చెప్పండి.'

- ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్లుగా రిక్రూట్​మెంట్​ లేదని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ తెలిపారు. 2014 నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. మంచిగా నడుస్తున్న గురుకులాలకు అధికారులు, నేతలు వస్తున్నారని.. బహుజనులు చదువుతున్న విశ్వవిద్యాలయాలకు ఎందుకు రావడం లేదన్నారు. ప్రైవేటు యూనివర్సీటీలు పెట్టి మీరు ఏం సాధించారని నిలదీశారు. అసలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎందుకు రాకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి లాంటివి.. హైదరాబాద్​లో ఇంకా నిర్మిస్తామని కేసీఆర్​ చెప్పారని.. మాటల గారడీతో సుమారు ఏడు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. యాసలు మాట్లాడి వాసాలు లెక్కపెడుతున్నారని ఆరోపించారు.

'మీ అందరి ఉత్సాహం చూస్తుంటే బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది. ఒలింపిక్స్​లో కేవలం 7 మెడల్స్​కే సంబురపడతున్నారు. బహుజనం రాజ్యంలో ఇండియా.. చైనాతో పోటీ పడుతుంది. బహుజన రాజ్యంలో కల్లుగీత కార్మికులు.. కంప్యూటర్​ ఇంజినీర్లలవుతారు. మైనార్టీలు మిలియనీర్లవుతారు. బంజారా బిడ్డలు బస్తీల్లో కాదు బంగ్లాల్లో ఉంటారు'

- ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్

ఇదీ చూడండి:

RS PRAVEEN KUMAR: నల్గొండలో అట్టహాసంగా రాజ్యాధికార సంకల్ప సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.