ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

author img

By

Published : Aug 30, 2022, 2:19 PM IST

death

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక అనే మరో ఇద్దరు కన్నుమూశారు.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. మరొకరు సోమవారం ఉదయం చనిపోయారు. పరిస్థితి విషమించిన లావణ్య, మౌనికలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.

ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..: మహిళల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని కుటుంబ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రవీందర్‌ నాయక్‌ ఆదివారం వెల్లడించారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన... ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వచ్చి... పరిస్థితిపై ఆరా తీశారు. అనుభవజ్ఞులైన వైద్యులే కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తారని... విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

బాధితుల ఆందోళన..: అంతకుముందు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళలు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. సుష్మ మృతదేహాన్ని సాగర్‌ రహదారిపై ఉంచి... అక్కడే బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహిళల మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.