ETV Bharat / city

తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. రెట్టింపు వేగంతో కేసుల నమోదు

author img

By

Published : Apr 8, 2021, 9:52 AM IST

corona death toll in telangana
corona virus

తెలంగాణలో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొదటి దశ కంటే రెట్టింపు వేగంతో కరోనా తన పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 1,914 కేసులు నమోదయ్యాయి. వీటితో పాజిటివ్​ కేసుల సంఖ్య 3,16,649కి చేరింది.

తెలంగాణలో కొవిడ్‌ పంజా విసురుతోంది. కొత్తగా ఒక్కరోజులోనే 1,914 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,16,649కి పెరిగింది. వైరస్‌తో మరో ఆరుగురు మరణించారు. ఇప్పటివరకూ 1,734 మంది కన్నుమూశారు. తాజాగా 285 మంది కోలుకోగా.. మొత్తం 3,03,298 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 6న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,617 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా.. వీరిలో 6,634 మంది ఐసొలేషన్‌లో వైద్యసేవల్లో ఉన్నారు.

అత్యధిక పరీక్షలు

తెలంగాణవ్యాప్తంగా మంగళవారం 74,274 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్కరోజు నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యధికం. 49.1 శాతం మంది ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు, 11.9 శాతం మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులకూ పరీక్షలు చేశారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,05,72,621కి పెరిగింది. 3,202 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తొలి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండగా.. ప్రస్తుతమూ అదే తీరు కొనసాగుతోంది. మరోవైపు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 393, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 205, నిజామాబాద్‌లో 179, రంగారెడ్డిలో 169, నిర్మల్‌లో 104, కరీంనగర్‌లో 80, సంగారెడ్డిలో 76, జగిత్యాలలో 68, కామారెడ్డిలో 64, వరంగల్‌ నగర జిల్లాలో 60, ఖమ్మంలో 48, సిద్దిపేటలో 42, నల్గొండలో 40, మంచిర్యాలలో 37, మహబూబ్‌నగర్‌లో 36, రాజన్న సిరిసిల్లలో 32, సూర్యాపేటలో 31 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 30 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం 57,803 మంది కొవిడ్‌ తొలిడోసు టీకాలను పొందారు. రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల వృథా 3.24 శాతంగా నమోదైనట్లు డీహెచ్‌ తెలిపారు.

బాసర ఆలయంలో..

  • నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పనిచేస్తున్న ఓ అర్చకుడు, మరో ఉద్యోగికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది.
  • కుమురంభీం జిల్లాలోని లింగాపూర్‌ మండలం కొత్తపల్లిలో బుధవారం 90 మంది పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు ఈ ఒక్క మండలంలోనే 103 కేసులు నమోదయ్యాయి.
  • ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో 20 మంది, లక్కారంలో 19 మంది, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) మండలం కొత్తపల్లిలో 12 మందికి కరోనా సోకింది.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరం గ్రామ జనాభా 612 కాగా.. ఇప్పటివరకు 89 కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం ఓ వృద్ధురాలు మృతి చెందింది.

రిజిస్ట్రేషన్‌ సేవలకు ‘వైరస్‌’

నిజామాబాద్‌ అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం ఆరుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దస్తావేజు లేఖరులతో పాటు నాలుగైదు రోజులుగా కార్యాలయానికి వచ్చినవారికి పరీక్షలు చేయడంతో మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో సోమవారం వరకు రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిపివేశారు.

టీకా తీసుకున్నా కరోనా

  • కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో రెండు డోస్‌ల టీకా తీసుకున్నా కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో మంగళవారం పరీక్ష చేయించుకోగా ఈ మేరకు నిర్ధారణ అయింది. ఇక్కడి పిల్లల వైద్యుల నిపుణుడికీ పాజిటివ్‌ వచ్చింది.
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్య సిబ్బంది ఫిబ్రవరిలో టీకా రెండో డోసు తీసుకున్నారు. అయినా వారికి బుధవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రాకేశ్‌ తెలిపారు.

బేగంబజార్‌లో ఆంక్షలు

హోల్‌సేల్‌ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌ మార్కెట్లలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘ది హైదరాబాద్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌’ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి వ్యాపారుల్లో సుమారు 100 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఈ నెల 9 నుంచి దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఇక్కడ సుమారు 1000 హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు ఉండగా, నిత్యం 40 -50 వేల మంది రిటైల్‌ వ్యాపారులు వస్తుంటారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం తప్పనిసరి చేసినట్లు అసోసియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి :

లైవ్ ఆప్​డేట్స్: కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.