ETV Bharat / city

రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: తెలంగాణ సీఎం

author img

By

Published : Mar 8, 2022, 7:34 PM IST

రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి
రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి

ఉద్యోగ నియామకాలకు సంబంధించి రేపు కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటన చేశారు. ఉదయం 10 గంటలకు శాసనసభలో ప్రకటన చేస్తానని.. నిరుద్యోగులు టీవీలు చూడాలని సూచించారు.

రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి

KCR On Job Notification: ఉద్యోగ నియామకాలకు సబంధించి రేపు కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటన చేశారు. ఉదయం 10 గంటలకు శాసనసభలో ప్రకటన చేస్తానని.. నిరుద్యోగులు టీవీలు చూడాలని సూచించారు. ఇవాళ ఉదయం నుంచి వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్​.. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాను చూస్తే కళ్లల్లో నీరు తిరిగేవని కేసీఆర్​ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎక్కడ చూసినా కరవు, బీడు భూములు కనిపించేవన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మన ప్రజాప్రతినిధుల అసమర్థత వల్ల వెనుకబడిపోయామని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడినందుకు 2014లో అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

సంక్షేమం, ప్రాజెక్టుల అభివృద్ధి చూసి రెండోసారి అవకాశం ఇచ్చారంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి గద్వాల దాకా పచ్చదనం కనిపిస్తోందని కేసీఆర్​ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్‌ జిల్లా వజ్రపు తునకగా మారుతుందని చెప్పారు. గతంలో పాలమూరు జిల్లా నుంచి లక్షల మంది వలస పోయేవారన్న కేసీఆర్​.. ఇప్పుడు కర్నూలు, కర్ణాటక వాసులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస వస్తున్నారని పేర్కొన్నారు.

'వలసలతో వలవల వలపించిన జిల్లా.. ఇప్పుడు ప్రాజెక్టులతో కళకళలాడుతోంది. వేలాది గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకున్నాం. వనపర్తిలో ఒకప్పుడు రూ.3 లక్షలు ఉన్న ఎకరం భూమి ఇవాళ రూ.3 కోట్లు పలుకుతోంది.' - కేసీఆర్

భారతదేశం.. తెలంగాణను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ​

తెలంగాణలో ఇవాళ ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవని కేసీఆర్​ వెల్లడించారు. వలసలు, విద్యుత్ కోతలు లేవన్నారు. తెలంగాణ లాగా దేశం పరిస్థితి కూడా మారాలని ఆకాంక్షించారు. ప్రజల దీవెన ఉంటే మరింత పురోగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ దళితకుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వటం లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. భారతదేశం... తెలంగాణను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు.

నా కంఠంలో ప్రాణముండగా ఆ పరిస్థితి రానీయ్యను

ప్రస్తుతం దేశంలో గోల్‌మాల్‌ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం కేసీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వర్గాల కుల, మత రాజకీయాలను సాగనీయనని స్పష్టం చేసిన కేసీఆర్​.. తన కంఠంలో ప్రాణముండగా తెలంగాణకు అంటువంటి పరిస్థితి రానీయబోనన్నారు.

'మతం పేరుతో ప్రజల మధ్య గొడవ పెట్టడం మంచిది కాదు. స్వార్థం కోసం ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారు. మతం అనే క్యాన్సర్‌ మనకు రాకుండా చూసుకోవాలి. దేశం కోసం పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నాం.' - కేసీఆర్

భాజపాను బంగాళాఖాతంలో కలపాలి

గిరిజనుల రిజర్వేషన్ పెంపు ప్రతిపాదనను కేంద్రానికి పంపితే మోదీ ఆమోదించట్లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలు తెలియవని విమర్శించారు. మత పిచ్చి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు వ్యతిరేకమైన కాషాయ పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్న గులాబీ దళపతి.. తెలంగాణకు భాజపా ఏం చేసిందో కాషాయ నేతలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. దేశ రాజకీయాలను చైతన్యం చేసేలా తనను దీవించాలని ప్రజలను కోరిన కేసీఆర్​.. బంగారు తెలంగాణ వలే బంగారు భారత్‌ కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఆ కారణంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం జగన్: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.