CM Jagan: 'ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్లు రూపొందించండి'

author img

By

Published : Sep 27, 2021, 6:41 PM IST

CM Jagan

రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్​ ప్లాన్లు రూపొందించి అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. తిరుమల తిరుపతి ఆలయాల తరహాలో అన్ని దేవాలయాల నిర్వహణ ఉండాలన్న సీఎం.. అక్కడ నిర్వహణ పద్ధతులపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ ఇవ్వాలన్నారు. దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలని సూచించారు. దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా సర్వేచేసి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. భద్రత కోసం ఆలయాలన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తీసుకురావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి విధానాలు అమలవుతున్నాయన్న సీఎం.. ఆ విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. ఆన్​లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ తితిదే విధానాలను పాటించాలని సూచించారు. దేవాదాయ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అవినీతికి చోటు ఉండొద్దు..

దేవాదాయశాఖలో అవినీతికి చోటు లేకుండా చూడాలని.. ఇందుకోసం ఆన్ లైన్ విధానాలను అవలంబించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఫలితంగా వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. ఆన్​లైన్ ద్వారా దాతలు ఎవరైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వొచ్చని.. ఇందుకు సంబంధించిన పద్ధతులు, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఎక్కడా పక్కదోవ పట్టకూడదని, ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలన్నారు. తితిదే తరహాలోనే ఇతర దేవాలయాల్లో కూడా వ్యవస్థలు ఉండాలని సూచించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని అవినీతి లేకుండా ఆలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆలయాలను బాగు చేయాలన్నారు. దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లు ఇచ్చామన్న సీఎం.. భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ప్రణాళిక విషయంలో క్రమం తప్పొద్దు..

ప్రతి దేవాలయంలో ఇచ్చే ప్రసాదాల నాణ్యత మీద దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్.. భక్తులకు గుర్తుండిపోయేలా ప్రసాదాలు ఉండాలన్నారు. తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లో వచ్చేలా చూడాలన్నారు. దీనివల్ల ప్రసాదాలు నాణ్యతగా ఉంటాయన్నారు. దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ,దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్లను రూపొందించాలని సూచించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, క్రమం తప్పకుండా ఈ ప్లాన్‌ను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. దేవాలయాల ఈవోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించారు. దేవాలయాల అభివృద్ధి ఈవో పనితీరు మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. దేవాలయాలో నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలన్నారు. తితిదే నిర్వహణా పద్ధతులపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ ఇవ్వాలన్నారు.

కమిటీని ఏర్పాటు చేయండి..

తితిదే తరహాలో దేవాలయాల్లో ఆడిటింగ్‌ పారదర్శకంగా జరగాలన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆన్​లైన్ బుకింగ్, కియోస్క్‌లు, క్యూఆర్‌ కోడ్‌ పేమెంట్స్, ఆన్​లైన్​ రూం బుకింగ్‌ వ్యవస్థ మొదలైన డిజిటలైజేషన్‌ ప్రక్రియ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం సర్వే చేసి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం ప్రతి జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల భద్రతపై సమీక్షించిన సీఎం.. రాష్ట్రంలోని సుమారు 18వేల ఆలయాల్లో భధ్రత కోసం సుమారు 47వేలకుపైగా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. ఎక్కడ ఆలయాలు ఉన్నా.. వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖలో విజిలెన్స్‌, సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల్లో భద్రత, తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలన్నారు.

వంశపారంపర్య అర్చకులకు రిటైర్‌మెంట్‌ తొలగింపును అమలు చేశామన్న సీఎం.. మిగిలిన వారికి కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాల్లో దూప ధీప నైవేద్యం కార్యక్రమం అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అర్చకులందరికీ ఇళ్లస్థలాల కేటాయింపుపై దృష్టి పెట్టాలన్నారు

ఇదీ చదవండి

GULAB EFFECT: మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు తక్షణ సాయం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.