GULAB EFFECT: మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు తక్షణ సాయం: సీఎం జగన్​

author img

By

Published : Sep 27, 2021, 12:54 PM IST

Updated : Sep 27, 2021, 3:31 PM IST

CM JAGAN VIDEO CONFERENCE ON CYCLONE AFFECTED AREA OFFICERS

గులాబ్ తుపాను (Gulab Cyclone) ప్రబావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ (cm jagan video conference on cyclone) నిర్వహించారు. తపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గులాబ్ తుపాను (Gulab Cyclone) అనంతర పరిస్థితులపై..ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష (cm jagan video conference on cyclone) నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై చర్చించారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రతిపాదికన విద్యుత్‌ పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తుపాను అనంతరం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం.. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని తెలిపారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి సూచించారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలు తెరవాలని, విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలన్నారు.

ముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు

ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు (Medical Camps) చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలన్నారు. అలాగే శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు రూ.వెయ్యి చొప్పున అందజేయాలని పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో త్వరగా పంట నష్టం అంచనాలు రూపొందించాలన్న సీఎం జగన్.. నష్టం అంచనాలు సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒడిశాలో వర్షాలు భారీగా కురుస్తున్నందున..వంధార, నాగావళి, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన చోట వారిని సహాయ శిబిరాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని విడుదల చేయాలని సూచించారు. మానవతప్పిదాలు లేకుండా చూసుకోవాలన్నారు. భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

వాయుగుండంగా మారిన తుపాన్

కళింగపట్నం వద్ద తీరం దాటిన గులాబ్ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ (IMD) స్పష్టం చేసింది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సెప్టెంబరు 30 తేదీ నాటికి మహారాష్ట్ర-గుజరాత్ కు సమీపంలో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి ఇది మళ్లీ బలపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర లోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణాల్లోనూ విస్తారంగా వర్షా కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఇదీ చూడండి: GANNAVARAM AIRPORT: వాతావరణం అనుకూలించక గాల్లో విమానం చక్కర్లు

Last Updated :Sep 27, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.