ETV Bharat / city

Choodamani on Ramappa : రామప్పపై యునెస్కోకు పుస్తకం రాశా!

author img

By

Published : Jul 27, 2021, 10:44 AM IST

choodamani
choodamani

ప్రఖ్యాత కాకతీయ కట్టడమైన రామప్ప... యునెస్కో వారసత్వ గుర్తింపు పొందేందుకు...ఎంతోమంది ఎన్నో విధాల కృషి చేశారు. కొందరు ఏళ్లకేళ్లు పరిశోధన సాగిస్తే... మరికొందరు మహోతృష్ణమైన శిల్ప సంపదతో అలరారే కట్టడం గురించి... రచనలు చేశారు. రామప్ప శిల్ప వైభవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటివారిలో ప్రముఖ నృత్యకారిణి, చరిత్ర పరిశోధకురాలు చూడామణి నందగోపాల్ ఒకరు. రామప్పకు వారసత్వ గుర్తింపు రావడంపై నందగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. తనలోని అంతరంగాన్ని ఆవిష్కరించారు.

నేను 1994 నుంచి యునెస్కో భారత ప్రతినిధిగా పనిచేస్తున్నా. 2017లో ఒక సదస్సులో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు పాపారావు పరిచయం అయ్యారు. రామప్ప గురించి వివరించారు. అప్పటికే ఈ ఆలయం ప్రత్యేకతలను వివరిస్తూ యునెస్కోకు డోజియర్‌ (పుస్తకం) పంపారు. కానీ అందులో సంస్కృతి గొప్పదనాలను సరిగ్గా వివరించలేదని తిరస్కరించారు. మళ్లీ పంపేందుకు ఓ పుస్తకం రాయాలని పాపారావు కోరారు. రామప్ప శిల్ప వైభవం గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఎలా అంటే... నేను పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు, 1990లో మొదటి పుస్తకం ‘డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఇన్‌ టెంపుల్‌ ఆర్కిటెక్చర్‌’ రాశా. అందులో రామప్పలోని నృత్య శిల్పాల గురించి రాశా. అలాంటి అద్భుత కళా సంపద కోసం పని చేయడం అదృష్టంగా భావించాను.

ఈ ఆలయమే చూడామణి!

ఇప్పుడు నేను రాసిన పుస్తకం ‘రామప్ప టెంపుల్‌... ది క్రెస్ట్‌ జువెల్‌ ఆఫ్‌ కాకతీయ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌’. క్రెస్ట్‌ అంటే చూడామణి. ఆ కాలంలో నిర్మించిన అన్ని ఆలయాల్లోకీ అద్భుతమైంది ఇదే అని ఈ పేరు పెట్టాం. 250 పుటల ఈ పుస్తకంలో శిల్ప సౌందర్యం, సాంస్కృతిక వైభవాలను వర్ణించా. దీని కోసం చాలా సార్లు ఆలయాన్ని సందర్శించా. ఓ వారం పూర్తిగా ఆలయం దగ్గరే ఉండి భిన్న కోణాల్లో లోతుగా అధ్యయనం చేశాను. నా దగ్గర పీహెచ్‌డీ చేస్తున్న విద్యాకుమారి మంచి నృత్యకారిణి. రామప్ప ఆలయంలోని శిల్పాల్లాగే విద్య అనేక ముద్రలు వేసింది. శిల్పాలతోపాటు, తన నృత్య రీతులనూ చిత్రాలు తీసి పుస్తకంలో పొందుపరిచాం.

ఆలయ ఘనతను రెండు కోణాల్లో వివరించాను. ఒకటి... టాంజబుల్‌, అంటే మనం చూడగలిగే కళాఖండాల విశేషాలు. రెండు... ఇన్‌టాంజబుల్‌... అంటే సాంస్కృతిక విశేషాలు. ఈ గుడిలో శైవ, వీరశైవ పూజారులు ఎంతో సమన్వయంతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రికీ గిరిజా కల్యాణాన్ని అద్భుతంగా జరుపుతారు. కళా ఖండాల విషయానికొస్తే నాట్య శాస్త్రానికే ప్రాధాన్యం ఇచ్చారు. భరత నాట్యంతో పాటు, పేరిణి భంగిమల్లో శిల్పాలు కనిపిస్తాయి. నృత్యం చేసే ఆరు అంగుళాల సూక్ష్మ శిల్పాల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న భారీ శిల్పాలు 600 వరకు ఉండటం గొప్ప విషయం. మహా భారతం, శివకల్యాణ పురాణ గాథలను అత్యద్భుతంగా చెక్కారు. గర్భాలయం రుద్రేశ్వరుడి ముందున్న రంగ మండపం దేశంలోనే అతిపెద్దది. ఇలాంటివన్నీ వివరించా. సాంకేతిక అంశాలను ఆచార్య పాండురంగారావు పొందుపరిచారు. ఈ పుస్తకం యునెస్కో దృష్టిని ఆకర్షించడంతో ఆ బృందం పర్యటనకు వచ్చింది. మొత్తంగా అందరి సమష్టి కృషితో ఆలయానికి విశిష్ట గౌరవం లభించింది.

డాక్టర్‌ చూడామణి నందగోపాల్‌

హంపీ కోసమూ పాటుపడ్డా...

మా స్వస్థలం కర్ణాటకలోని మైసూరు. మైసూర్‌ విశ్వవిద్యాలయంలో చరిత్రపై పీహెచ్‌డీ చేశా. మా వారు నందగోపాల్‌ ఐఐఎంలో ఆచార్యుడిగా పదవీ విరమణ పొందారు. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాం. అక్కడి జైన్‌ విశ్వవిద్యాలయంలో డీన్‌గా పదవీ విరమణ చేశా. చరిత్ర, సంస్కృతుల మీద నా పరిశోధనలకు దిల్లీలోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ మ్యూజియం నుంచి ఠాగూర్‌ జాతీయ ఫెలోషిప్‌ దక్కింది. హలెబేడు, బేలూరు కట్టడాలకు యునెస్కో గుర్తింపు వచ్చేందుకూ నా వంతు తోడ్పాటును అందించా. 2004లో హంపీని ఎన్‌డేంజర్డ్‌గా ప్రకటించేందుకు యునెస్కో సిద్ధమైంది. కారణం... హంపీ ఆలయాలకు సమీపంలో భారీ వంతెనలు కట్టడానికి ప్రతిపాదనలు పెట్టడం. ఈ విషయం తెలిసి... కొందరు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాను. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణను కలిసి ఆ ప్రతిపాదనలు విరమింపజేశాము. హంపీ సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో వారసత్వ హోదాను తొలగించలేదు. ఇప్పటి వరకు నా పర్యవేక్షణలో 20 మంది పీహెచ్‌డీ చేశారు. మన దేశంలో గొప్ప చారిత్రక ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఆర్కియాలజీలో అవకాశాలకు కొదవ లేదు. సహజంగా ఉండే ఓర్పు, నిశిత పరిశీలన మహిళలు ఈ రంగంలో రాణించడానికి ఎంతో తోడ్పడతాయి.

- గుండు పాండురంగశర్మ, వరంగల్‌

- దీపా కర్మాకర్‌, జిమ్నాస్ట్‌

జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే మాత్రం ఎన్ని కష్టాలు, ఇబ్బందులెదురైనా వెనుకడుగు వేయకూడదు. మహిళల్లో ఆ శక్తి ఉంది.

ఇదీచూడండి: RAMAPPA: గుర్తింపు దక్కింది సరే.. సంరక్షణ మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.