ETV Bharat / city

జూబ్లీహిల్స్​ ఘటన మాదిరిగానే పాతబస్తీలో మరో రేప్.. రెండు కేసుల్లోనూ అవన్నీ సేమ్!

author img

By

Published : Jun 5, 2022, 10:49 PM IST

Old city rape case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్​ అత్యాచారం ఘటన మరవకముందే.. అచ్చం అలాంటిదే మరో ఘటన హైదరాబాద్ పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలోనూ బాధితురాలు 17 ఏళ్ల మైనరే​ కావటంతో పాటు.. మరికొన్ని విషయాల్లోనూ సారూప్యం ఉండటం గమనార్హం. ఈ ఘటన మే30న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే?

Old city rape case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో సంచలంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటపెడుతున్నారు. దీంతో.. కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో ప్రజాప్రతినిధుల కుమారులుండటం.. వాళ్లు కూడా మైనర్లే కావటంతో.. ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. అచ్చం ఇలాంటి ఘటనే ఇంకోటి పాతబస్తీలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్​ ఘటనకు.. ఈ ఘటనకు పలు సారూప్యతలు ఉన్నాయి.

బస్సు కోసం ఎదురుచూస్తుంటే..: హైదరాబాద్​లోని కాలపత్తర్ పోలీస్​స్టేషన్ పరిధి ప్రాంతంలో నివాసముండే 17 ఏళ్ల అమ్మాయి.. చార్మినార్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్​గర్ల్​గా పనిచేస్తోంది. రోజూలాగే మే 30వ తేదీన.. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్​ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో.. ఈవెంట్​ మేనేజర్​గా పనిచేస్తున్న లంగర్​హౌస్​కు చెందిన సూఫీయాన్(23) అక్కడికి వచ్చాడు. అమ్మాయిని చూసి.. మాట కలిపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. అమ్మాయిని ఆటోలో తన ఇంటికి తీసుకెళ్లాడు. తనకు దుకాణంలోనే ఆలస్యమైందని.. తోటి స్నేహితురాలి ఇంట్లోనే ఉంటానని అమ్మాయి తల్లికి ఫోన్​ చేసి సమాచారం ఇచ్చింది. కట్​ చేస్తే.. 31న ఉదయం అమ్మాయిని సూఫీయన్​.. షా అలీ బండ వద్ద వదిలి వెళ్లిపోయాడు.

ఐదు రోజుల తర్వాత..: అక్కడి నుంచి అమ్మాయి ఇంటికి చేరుకుంది. కాగా.. ఐదురోజుల తర్వాత అనగా ఈరోజు(జూన్​ 5న) అమ్మాయికి కడుపునొప్పి మొదలైంది. ఇబ్బందిపడుతున్న కూతురుని తల్లి ఏమైందని అడిగితే.. కడుపునొప్పి అని చెప్పింది. తల్లికి అనుమానం వచ్చి.. ఏం జరిగిందని గట్టిగా ఆరా తీయటంతో అమ్మాయి అసలు విషయం చెప్పింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తనను.. పెండ్లి చేసుకుంటానని సూఫీయన్​ మాయమాటలు చెప్పాడని.. అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని.. ఉదయం కాగానే షా అలీ బండ వద్ద వదిలేసి వెళ్లిపోయాడని తల్లికి వివరించింది. దీంతో.. బాధితురాలి తల్లి వెంటనే కాలపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

రెండు ఘటనల్లో అవే : జూబ్లీహిల్స్​ అత్యాచార ఉదంతానికి.. ఈ ఘటనకు మధ్య చాలా సారూప్యతలున్నాయి.

1. రెండు ఘటనల్లోని బాధితులు మైనర్లు.

2. ఈ రెండు ఘటనలు రెండు రోజుల వ్యవధిలోనే జరిగాయి.

3. వెలుగులోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చాయి.

4. ఇద్దరు బాధితురాళ్లను తల్లులు ఆరాతీయడం వల్లనే.. విషయం బయటపడింది.

5. రెండు ఘటనల్లో.. బాధితురాళ్లకు నిందితులకు అంతకుముందు ఎలాంటి పరిచయాలూ లేకపోవటం కీలక అంశం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.