ETV Bharat / city

Amaravathi Farmers: "ప్రజలు కూకటివేళ్లతో జగన్ సర్కారును పెకిలిస్తారు"

author img

By

Published : Nov 22, 2021, 9:48 PM IST

Amaravathi Farmers
రాజధానిపై ప్రభుత్వ వైఖరి పట్ల రైతుల ఆగ్రహం

మూడు రాజధానుల బిల్లులపై ఏపీ హైకోర్టులో, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై అమరావతి రైతులు (Amaravati Farmers On Three Capitals Repeal Bill) మండిపడుతున్నారు. న్యాయస్థానంలో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో నాటకానికి తెరతీశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా అమరావతి రైతుల్ని అష్టకష్టాలు పెడుతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు లేనిపోని డ్రామాలతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతోందని ధ్వజమెత్తారు.

మూడు రాజధానుల చట్టంపై (Three Capitals Repeal Bill) ఇవాళ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెుదట రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటాన్ని స్వాగతించిన రైతులు.. ఆ తరువాత మళ్లీ సమగ్రంగా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువస్తామని సీఎం జగన్ ప్రకటించటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపం, మెుండి వైఖరితో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రాజధానులంటూ ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో ప్రభుత్వంలోని ఏ ఒక్కరికీ సరైన స్పష్టత లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లోనూ.. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో అన్నదాతలు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చినప్పటి మాటకు కట్టుబడి ఉండాలని.. లేకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలివేస్తారని ధ్వజమెత్తారు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravathi farmers Padayatra) 22వ రోజున నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పోరుబాట పట్టిన అన్నదాతలకు..గౌడ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగుడుగునా పాదయాత్రకు స్థానికులు పూలవర్షంతో మద్దతు తెలిపారు. కావలిలో పోలీసులు పదే పదే నిబంధనల పేరిట ఆంక్షలు విధించారు. పెద్దఎత్తున యాత్ర చేస్తున్నారంటూ డీఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. ఐకాస నేతలు కాళ్లు పట్టుకుని యాత్రను అడ్డుకోవద్దంటూ వేడుకున్నారు.

రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా కావలిలో ముందుకు సాగుతున్న అన్నదాతలను స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఇంటి మీదుగా వెళ్లేటప్పుడు శబ్ధం చేయకుండా నడవాలని పోలీసులు చెప్పడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి మహా పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే ప్రభుత్వం.. అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో ధ్వజమెత్తిన అన్నదాతలు.. పాదయాత్రను మరింత ఉద్ధృతంగా ముందుకు సాగించారు. 13 కిలోమీటర్ల మేర నడిచిన రైతులు.. కొండబిట్రగుంట చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి

Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.