ETV Bharat / bharat

భారత్‌ అంతటా ఫుడ్‌ పార్కులు.. 'ఐ2యూ2' తొలి సమావేశంలో నిర్ణయం

author img

By

Published : Jul 15, 2022, 4:55 AM IST

Updated : Jul 15, 2022, 5:11 AM IST

భారత్‌ అంతటా ఫుడ్‌ పార్కులు
భారత్‌ అంతటా ఫుడ్‌ పార్కులు

భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది.

భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. వీడియో ద్వారా గురువారం నిర్వహించిన సమావేశంలో- ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని యాయిర్‌ లాపిడ్‌, యూఏఈ పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ పాల్గొన్నారు.

నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై చర్చించారు. సభ్య దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో నెలకొన్న భారీ సవాళ్లను అధిగమించేందుకు దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని యోచించారు. ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని అధిగమించడంపై, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై లోతుగా చర్చించారు. గుజరాత్‌లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు.

ఇంధన, ఆహార భద్రతే లక్ష్యంగా..: తొలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. "ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక వృద్ధే లక్ష్యంగా.. మొదటి భేటీలోనే ఎంతో దార్శనికతతో ప్రగతిశీల, ఆచరణాత్మక, సానుకూల అజెండాను తీసుకురావడం విశేషం. ఉమ్మడి పెట్టుబడులు, నైపుణ్యాలు, మార్కెట్లను వినియోగించడం ద్వారా అజెండాలోని లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సమావేశం బాటలుపరిచింది. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ... లక్ష్య సాధనకు కూటమి దేశాలు మంచి నమూనాతో ముందుకొచ్చాయి. ఆచరణాత్మక సహకారానికి ఐ2యూ2 మార్గదర్శకం కానుంది" అని మోదీ పేర్కొన్నారు.

వ్యవసాయోత్పత్తులు ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుతాయి: భైడెన్‌

అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రైవేటు రంగ నిపుణుల సహకారంతో భారత్‌లో సమీకృత వ్యవసాయ పార్కులను అభివృద్ధి చేయదలిచామని బైడెన్‌ తెలిపారు. తద్వారా భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తులు ఐదేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతాయన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆహార, ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతోందని చెప్పారు. ఇలాంటి సవాళ్లు పలు దేశాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను చాటుతున్నాయన్నారు. "ప్రపంచంలో అధిక ఆహారోత్పత్తి సాధించే దేశం భారత్‌. ఫుడ్‌ పార్కుల ఏర్పాటుతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది. ఆహార కొరత తీరి, ప్రజలకు పౌష్టికాహార లేమి నుంచి విముక్తి లభిస్తుంది" అని బైడెన్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి

పన్నీర్​సెల్వంకు 'పళని' మరో షాక్​.. కుమారులు సహా వారంతా పార్టీ నుంచి ఔట్​

సెజ్‌ స్థానంలో దేశ్‌.. రాష్ట్రాలకూ అధికారాలు.. బిల్లుపై కేంద్రం కసరత్తు

Last Updated :Jul 15, 2022, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.