సీఎం జగన్ ఎలా గుర్తుంచుకుంటారో నేను ఆలాగే! చిరుద్యోగిపై వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు - YSRCP leaders Threats
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 10:26 AM IST
YSRCP MLA Kadubandi Srinivasa Rao Threats to MGNREGA Field Assistant in Vizianagaram District : మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న అధికార పార్టీ నేతల దాడులు, బెదిరింపులకు హద్దు లేకుండా పోయింది. 'నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తుందేమిటి జూన్ 4 తరువాత ఉరిశిక్షకు రెడీ అయిపో' అంటూ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఉపాధి హామీ పథకం చెరువు పనుల వద్ద తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారని కీల్తంపాలెం క్షేత్ర సహాయకుడు సోమేశ్పై కడుబండి విరుచుకుపడ్డారు. కాదని సోమేశ్ వేడుకుంటున్నా వినకుండా తన అంతు చూస్తానని బెదిరింపులతో రెచ్చిపోయారు. సీఎం జగన్ ఎలాగైతే కొన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారో తానూ అలాగే గుర్తుపెట్టుకుంటానంటూ కడుబండి శ్రీనివాసరావు సోమేశ్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు, ఆయన భార్య సంగతి జూన్ 4న చెబుతామని సీఎం జగనే చెప్పారని సోమేశ్ను బెదిరించారు.