హోటల్లో పేలిన కుక్కర్ - మంటలు చెలరేగి యువతి సజీవ దహనం - FIRE ACCIDENT IN HOTEL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 5:03 PM IST
Hotel Fire Accident in Anantapur District : అనంతపురం జిల్లాలో ఘెర అగ్ని ప్రమాదం జరిగింది. కూడేరు మండలం జల్లిపల్లిలోని ఓ హోటల్లో రైస్ కుక్కర్ పేలి సమీపంలో గ్యాస్ సిలిండర్ వరకు మంటలు వ్యాపించాయి. దీంతో ఒకసారిగా గ్యాస్ సిలిండర్ పేలి హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓ యువతి సజీవ దహనమైంది. మృతి చెందిన యువతి హోటల్ యజమాని కుమారై ప్రత్యూషగా (21) స్థానికులు గుర్తించారు. మంటల్లో సజీవ దహనం అయిన ప్రత్యూష బీఎస్సీ నర్సింగ్ చదువుతుందని స్థానికులు తెలిపారు హోటల్ యజమాని భార్య జ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హఠాత్తుగా హోటల్ నుంచి మంటలు వ్యాపించడం స్థానికులు అప్రమత్తం అయ్యారు. హోటల్ నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనతో జల్లిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.