'మైనార్టీల ద్రోహి జగన్'- పాత పథకాలన్నీ పునరుద్ధరిస్తాం : టీడీపీ నేత మహ్మద్ ఇక్బాల్ - mohammed iqbal comments on jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 6:59 PM IST
TDP Leader Mohammed Iqbal Fire on Jagan : ముస్లిం మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారన్న అక్కసుతోనే ఆ వర్గాల్లో వైఎస్సార్సీపీ విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన్ అంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లపాటు బీజేపీతో అంటకాగి ఇప్పుడు టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్పై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఏం చేసినా వంతపాడారన్నారు.
మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సీఏఏతో పాటు ఇతర చట్టాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. జగన్ను నమ్మొద్దని మైనార్టీల వర్గాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునఃనిర్మాణం, అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లకు ఎలాంటి డోకా లేదని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం, మైనార్టీలకు గతంలో అందించిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ముస్లిం, మైనార్టీలంతా ఏకమై రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మహ్మద్ ఇక్బాల్ కోరారు.