ఇళ్ల తొలగింపునకు అధికారులు సిద్ధం - బాధితులకు అండగా టీడీపీ-జనసేన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 7:52 PM IST
TDP-Janasena Leaders Support Residents in Railway Sites: గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైల్వే స్థలాల్లోని నివాసితులకు తెలుగుదేశం, జనసేన నేతలు అండగా నిలిచారు. దాదాపు 73 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న 600 మంది ఇళ్లను తొలగిస్తామని అధికారులు నోటీసులు ఇవ్వటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫిబ్రవరి 2న తొలగిస్తామని అధికారులు హుకుం జారీ చేశారు. తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు పలువురు టీడీపీ, జనసేన నేతలు ఇంటింటికి తిరిగి న్యాయం చేస్తామని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. మన ఇళ్లను మనం కాపాడుకుందాం అంటూ బాధితులకు భరోసా ఇచ్చారు.
రైల్వే అధికారులతో సంప్రదించి ఇళ్లు తొలగించకుండా తగిన చర్యలు తీసుకుంటామని లేనిపక్షంలో న్యాయం కోసం అందరూ కలిసి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రదేశంలో నివాసితుల గురించి లోకేశ్తో చర్చించామని వ్యక్తం చేశారు. దీనిపై లోకేశ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.