LIVE: నిజం గెలవాలి యాత్రపై ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ- మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - Panchumurthy Anuradha PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 1:09 PM IST
|Updated : Apr 15, 2024, 1:28 PM IST
MLC Panchumurthy Anuradha Media Conference Live: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమ శాఖనే నివేదిక ఇవ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ పాలనలో లక్షా 48 వేల నేరాలు మహిళలపై జరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధ్వానంగా తయారు చేసిన హీన చరిత్ర జగన్ రెడ్డిదే అని అనూరాధ విమర్శించారు. మహిళ సాధికారత తీసుకువస్తానన్న ముఖ్యమంత్రి నేడు మహిళా సంహారమే చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎంతసేపు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారో అని కదలికలను గమనించడం, వారిని ఏ కేసులో అరెస్టు చేయాలా అనే దృష్టి వైసీపీకి పాలనపై లేదని దుయ్యబట్టారు. వైసీపీ గడ్డు రోజులు రాబోతున్నాయని, మహిళల ఉసురే వైసీపీకి తాకుతుందని అనూరాధ మండిపడ్డారు. ఈ క్రమలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పాదయాత్రపై ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.