వైసీపీ అసత్య ప్రచారాలతో ముస్లిం ఓట్లు దండుకోవాలని చూస్తోంది : ఎంఏ షరీఫ్ - MA Shariff angry with jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 10:44 PM IST
MA Sharif Fires on YS Jagan : వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలకు, మోసపూరిత విధానాలకు పాల్పడి ముస్లింలను మోసం చేస్తోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అమలుచేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. బడ్జెట్లో కేటాయించిన మైనారిటీ కార్పొరేషన్ నిధుల్ని నవరత్నాలకు దారిమళ్లించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలు వెలవెల బోతున్నాయని విమర్శించారు. అందుకే ఓడిపోబోతున్నామన్న భయంతో వైసీపీ మళ్లీ కుట్రలు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు చేసి మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని విమర్శించారు.
అన్ని సర్వేలు వెల్లడించిన వివరాల ప్రకారం కూటమికి దాదాపుగా 160 స్థానాలు వస్తాయని తెలిపారు. ముస్లింలకు విద్య, ఉద్యోగంలో నాలుగు శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంశం దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లెేదు. కాబట్టి దీన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు, అడ్డుకోలేరని తెలిపారు. అలాగే ముస్లింలకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని షరీఫ్ హామి ఇచ్చారు. వైసీపీను గద్దె దించడంలో ముస్లింలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.