వన దేవతలను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్త జనం
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 11, 2024, 2:20 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2024/640-480-20722811-thumbnail-16x9-medaram.jpg)
Heavy Crowd Visit Sammakka Saralamma In Mulugu : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం నుంచే వేలాది వాహనాలలో ఆ తల్లుల సన్నిధికి చేరుకున్నారు. రాత్రి బస చేసిన భక్తులు, ఉదయాన్నే జంపన్న వాగుకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు కుంకుమ నీటిలో చల్లి, కొబ్బరికాయలు కొట్టి, బొడ్డుపై ఉన్న కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. పసుపు, కుంకుమ, ఒడి బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు, పువ్వులు పండ్లు పట్టుకొని తల్లుల సన్నిధికి చేరారు. మొక్కిన మొక్కులు తీర్చిన తల్లులకు పసుపు కుంకుమలతో పాటు బెల్లాన్ని, నైవేద్యాన్ని సమర్పించారు.
Medaram Jatara Rush 2024 : భారీగా భక్తులు రావడంతో ఎండోమెంట్ అధికారులు సమ్మక్క సారలమ్మ గద్దెల తలుపులు మూసివేశారని అధికారులు తెలిపారు. దీంతో బయట నుంచే భక్తులు ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆ తల్లిని దర్శించుకునేందుకు ఇంకా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. జంపన్న వాగు నుంచి అమ్మవారి దేవాలయం వరకు రహదారి వెంబడి భక్తులు కిక్కిరిసిపోయారు. అటు భక్తులు ఇటు ఆటోలు నడుస్తూనే ఉన్నాయి.