ETV Bharat / state

గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 7:19 PM IST

Updated : Feb 19, 2024, 8:57 PM IST

Group1 Notification re Released
TSPSC Released Group 1 Notification

Group-1 Notification Released : టీఎస్‌పీఎస్సీ 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది.

Group-1 Notification Released : నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న గ్రూప్‌-1(Group-1 Notification) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్​పీఎస్సీ(TSPSC) గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీచేసింది. అంతకుముందు 2022 ఏప్రిల్ 26 న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ, ప్రిలిమ్స్‌ నిర్వహించింది. పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించింది.

Group-1 New Notification Released Today : కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా రెండోసారి పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీఎస్​పీఎస్సీ అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ విజ్ఞప్తి మేరకు అప్పీలును వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గ్రూప్‌-1 పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్‌-1లో ఇటీవల కొత్తగా 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మే లేదా జూన్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించనుంది. గత నోటిఫికేషన్‌ రద్దు చేసినందున అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీఎస్​పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసినా, మ‌ళ్లీ చేయాల్సిందేనని తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని కమిషన్ ప్రకటించింది.

Group-1 Notification Released
గ్రూప్​-1 నోటిఫికేషన్​

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

మూసీ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించండి : అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Last Updated :Feb 19, 2024, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.