ETV Bharat / state

LIVE UPDATES : రేపటికి వాయిదా పడిన శాసనసభ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 9:57 AM IST

Updated : Feb 9, 2024, 6:42 PM IST

Telangana Budget Sessions 2024
Telangana Assembly Sessions 2024 Live News

Telangana Assembly Sessions 2024 Live News : గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ చర్చలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమాధానం ఇచ్చారు.

6.42 PM

మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్​

గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో శాససనభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్​ నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్​.

4.38 PM

సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్​కు కీలక బాధ్యతలు : సీఎం రేవంత్​ రెడ్డి

ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నామని చెప్పారు. సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్​లకు కీలక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారన్నారు.

4.35 PM

గ్రూప్​-1 వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు : సీఎం రేవంత్​ రెడ్డి

ఈ ప్రభుత్వం 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే గ్రూప్​-1 నోటిఫికేషన్​ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రూప్​ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయిందని సీఎం స్పష్టం చేశారు. జెరాక్స్​ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదని అన్నారు.

4.29 PM

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోంది : సీఎం రేవంత్​ రెడ్డి

మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రముఖంగా దేవాదాయ శాఖ ఆదాయం పెరుగుతోందని అన్నారు.

4.26 PM

కొందరు నేతలు ఆటోలు కెమెరాలు పెట్టుకుని నటన ప్రదర్శిస్తున్నారు : సీఎం రేవంత్​

మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తే విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి విపక్ష నేతలపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వం మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిందన్నారు. మొదటిసారి ఏర్పడిన నాటి టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం తొలిసారే ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిందని తెలిపారు. కొందరు నేతలు ఆటోలో కెమెరాలు పెట్టుకుని నటన ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

4.21 PM

ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండానే రైతు బంధు ఇవ్వలేదని గొడవ : సీఎం రేవంత్​ రెడ్డి

గత ప్రభుత్వం 2018- 19లో యాసంగి రైతుబంధును పూర్తి చేయడానికి ఐదు నెలలు తీసుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. 2019-20లో రైతుబంధు పూర్తి చేసేందుకు 9 నెలలు పట్టిందన్నారు. 2020-21లో రైతుబంధు పూర్తి చేసేందుకు 4 నెలలు పట్టిందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకుండానే రైతుబంధు ఇవ్వలేదని రైతులను రెచ్చగొడుతున్నారని బీఆర్​ఎస్​ నేతలపై మండిపడ్డారు.

4.17 PM

ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చాము : సీఎం రేవంత్​ రెడ్డి

ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని సీఎం రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని సామెతను విసిరారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఈ నెల 1వ తేదీన జీతాలు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు. మంచి పనులకు అభినందించే సద్బుద్ధి కూడా విపక్షాలకు లేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

4.13 PM

జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చింది : సీఎం రేవంత్​ రెడ్డి

అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారని సీఎం చెప్పారు. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రం వచ్చాక జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించారన్నారు. కానీ తెలంగాణ వచ్చాక జయజయహే తెలంగాణ పాటను నిషేధించినంత పని చేశారని మండిపడ్డారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించే నిర్ణయాన్ని విపక్ష నేత అభినందిస్తారని అనుకున్నా ప్రధాన విపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

4.06 PM

రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి : సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్ర అధికారికి చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లమని గుర్తు చేశారు. కొందరు యువకులు వారి గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టీజీ అనే రాసుకున్నామని చెప్పారు. కేంద్రం కూడా వారి నోటిఫికేషన్​లో టీజీ అని పేర్కొందని సీఎం తెలిపారు. కానీ అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్పరించేలా టీఎస్​ అని పెట్టిందని మండిపడ్డారు.

12: 42 PM

ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదు : పాయల్ శంకర్‌

గవర్నర్​ ప్రసంగంలో హామీలు ఎలా అమలుచేస్తారో చెబితే బాగుండేదని పాయల్ శంకర్‌ అన్నారు. గతంలో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదని చెప్పారు. ఆరు గ్యారంటీలే తప్ప మిగతా గ్యారంటీలకు హామీ ఎవరిస్తారని ప్రశ్నించారు. మిగతా హామీలు ఎప్పటిలోగా ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెబితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులెన్నో ప్రస్తావిస్తే బాగుండేదిని తెలిపారు.

12: 36 PM

తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారు: పాయల్ శంకర్‌

తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిదని పాయల్ శంకర్‌ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో మన్మోహన్‌, సోనియాను గుర్తు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం సీఎంలా చురుగ్గా లేదని చెప్పారు.

12: 26 PM

గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుంది : ఎమ్మెల్యే పాయల్ శంకర్‌

గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని హామీలనే ప్రస్తావించారని తెలిపారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో సుష్మా స్వరాజ్ గురించి ఒక్కమాట చెప్పలేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచారని తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆరోగ్యశ్రీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో 60 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బాధితులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

12: 24 PM

సీఎంను మార్చేందుకు మాకు ఎవరి అనుమతీ అక్కర్లేదు: పోచారం

సీఎంను మార్చేందుకు తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని పోచారం శ్రీనివాస్ అన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదుని స్పష్టం చేశారు.

12: 22 PM

బీఆర్ఎస్​, బీజేపీది ఫెవికాల్ సంబంధం: రేవంత్‌రెడ్డి

సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తమకు కొన్ని చెబుతారు. కొన్ని దాస్తారని అన్నారు. బీఆర్ఎస్​, బీజేపీది ఫెవికాల్ సంబంధమన్నారు.

12: 16 PM

బీఆర్ఎస్​ పదేళ్లుగా కేంద్రానికి అండగా నిలిచింది: సీఎం రేవంత్​ రెడ్డి

బీఆర్ఎస్​ పదేళ్లుగా కేంద్రానికి అండగా నిలిచిందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్​ మద్దతు పలికిందని తెలిపారు. బీఆర్ఎస్​,బీజేపీ నేతలు కలిసి పలుసార్లు చర్చించుకున్నారని పేర్కొన్నారు.

12: 16 PM

మీరిచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నాం: పోచారం

కాంగ్రెస్​ ఇచ్చిన హామీలనే తమకు గుర్తు చేస్తున్నామని పోచారం శ్రీనివాస్ అన్నారు. హామీలన్నీ నెరవేరిస్తే తమకే మంచిపేరు వస్తుందని సలహా ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హితవు పలికారు.

11:57 AM

ఫార్మా సిటీ రద్దు చేస్తామన్న ఆలోచన మంచిది కాదు : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

ఫార్మా సిటీ రద్దు చేస్తామన్న ఆలోచన మంచిది కాదని పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ రద్దు ప్రచారంతో పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొందన్నారు. ఫార్మా సిటీకి హైదరాబాద్ రాజధానిగా ఉందని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో మనం అగ్రస్థానం సాధించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మరిన్ని ఏఐ, డ్రోన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ ప్రభుత్వంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. నర్సుల పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు.

ప్రగతి భవన్‌లోనే ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. సింగరేణి సమస్యలు పరిష్కరించింది ప్రగతి భవన్‌లోనేనని గుర్తు చేశారు. ప్రతిరోజు ప్రజాభవన్‌కు వస్తానని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ప్రజాభవన్‌లో గంటసేపైనా ప్రజల కష్టాలు వింటా అని సీఎం చెప్పారని అన్నారు. రెండోరోజు నుంచి సీఎం ప్రజాభవన్‌కు వెళ్లలేదని ప్రజల కష్టాలు వినలేదని ఆరోపించారు.

11:52 AM

అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం : మంత్రి శ్రీధర్​ బాబు

రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుందని తెలిపారు. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వవద్దని రాహుల్‌గాంధీ చెప్పారని అన్నారు.పెట్టుబడుదారులను స్వాగతిస్తామని స్పష్టం చేశారు. క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించే ఆలోచనే తమకు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వమని మంచివి అయితే తీసుకుంటామన్నారు. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడదామన్నారు.

11:50 AM

అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది: పల్లా

యాదగిరిగుట్ట పనుల్లో అవినీతి జరిగిందని ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ ఇంకా పెంచాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. క్రానీ క్యాపిటల్‌ వద్దని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని మండిపడ్డారు.

11:47 AM

మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలి : సునీతా లక్ష్మారెడ్డి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బస్సు ట్రిప్పులు తగ్గించడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు పెంచాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

11:44 AM

ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారు : మంత్రి పొన్నం

ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులకు అండగా నిలబడాలని కోరారు. ఆర్టీసీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారే ఇవాళ ఆటోల్లో ఎక్కారని అన్నారు.

11:34 AM

బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య: సీతక్క

మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని బీఆర్ఎస్​ను నిలదీశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్​ఎస్​ నేతల నైజం ఉందని మండిపడ్డారు.

11:24 AM

చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పల్లా రాజేశ్వర్​ రెడ్డి కోరారు. కాంగ్రెస్​ చెప్పిన 13 అంశాల గురించే తాము అడుగుతున్నామన్నార ఆటో డ్రైవర్ల రుణాలు మాఫీ చేయాలన్నారు. మహిళల కోసం బస్సులు పెంచాలని కోరుతున్నామన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని చెప్పారు.

11:21 AM

ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు సాయం చేస్తాం : శ్రీధర్‌బాబు

ఆటో డ్రైవర్ల సంక్షేమం తమ బాధ్యత అని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు సాయం చేస్తామన్నారు. బడ్జెట్‌లో పెట్టి ఆటో డ్రైవర్లకు సాయం చేస్తామని తెలిపారు.

11:18 AM

ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈఎంఐలు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.

11:16 AM

బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని పల్లా రాజేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని అడిగారు. ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

11:09 AM

గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

గవర్నర్‌తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ప్రగతి భవన్‌ గతంలో కూడా ప్రజా భవన్​ అని తెలిపారు. ప్రజా భవన్‌కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని ఆరోపించారు. రెండు నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమని సూచించారు.

11:01 AM

విద్యాశాఖలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి : యెన్నం శ్రీనివాసరెడ్డి

విద్యాశాఖలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకేసారి 9 వేలమంది విద్యా వాలంటీర్లను తొలగించారని మండిపడ్డారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.

10:59 AM

పదేళ్లుగా ఫొటోలు, సెల్ఫీలకే పరిమితం అయ్యారు : యెన్నం శ్రీనివాసరెడ్డి

పదేళ్లుగా ఐటీ రంగంలో గత ప్రభుత్వం చేసిందేమీ లేదని యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్లుగా ఫొటోలు, సెల్ఫీలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.

10:56 AM

పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్ మొండిచేయి చూపించారు : యెన్నం శ్రీనివాసరెడ్డి

పాలమూరు జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్ మొండిచేయి చూపించారని ఆరోపించారు. దావోస్ సదస్సుపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులకు సంతకాలు చేశారని తెలిపారు. వెళ్లిన తొలి సదస్సులోనే రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులా అని ఆశ్చర్యపోతున్నారని అన్నారు.

10:50 AM

బస్సుల్లో మహిళలకు ఉచితం అంటే హేళన చేశారు: యెన్నం

బస్సుల్లో మహిళలకు ఉచితం అంటే హేళన చేశారని శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్లుగా నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వందలకొద్దీ దొంగ జీవోలు ఇచ్చారని ఆరోపించారు. దొంగ జీవోలతో భూములు కొట్టేశారని అన్నారు. ఆ కుటుంబానికి, అధికారులకు, ప్రజలకు వేర్వేరుగా జీవోలు ఇచ్చారని అన్నారు. సాగర్‌, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. పదేళ్లుగా బీఆర్​ఎస్​ కట్టినవి వరుసగా కూలిపోతున్నాయని పేర్కొన్నాయి.

10:45 AM

2014, 2018లో ఇచ్చిన హామీలన్నీ కలిపి 420 అవుతాయి : యెన్నం శ్రీనివాసరెడ్డి

గత ప్రభుత్వ మ్యానిఫెస్టోలో అన్నీ మోసాపూరిత హామీలేనని యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. 2014, 2018లో ఇచ్చిన హామీలన్నీ కలిపి 420 అవుతాయని ఎద్దేవా చేశారు. పరిపాలన ప్రగతి భవన్‌, ఫామ్‌హౌస్‌ నుంచి జరగకూడదని అన్నారు. పరిపాలన అనేది సచివాలయం నుంచి జరగాలన్నారు. కర్ర కాల్చి వాత పెట్టే చైతన్య తెలంగాణ అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము పాలకులం కాదు సేవకులం అని తమ సీఎం చెప్పారని తెలిపారు. తాము ఇచ్చిన గ్యారంటీలు అన్ని పేదలకు ఉపయోగపడతాయని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళం చేస్తున్నామని గుర్తు చేశారు.

10:40 AM

తెలంగాణ బిడ్డలకు పదేళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చింది : యెన్నం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ బిడ్డలకు పదేళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందని యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపించామని తెలిపారు. సమస్యలు చెప్పుకునేందుకు ఇప్పుడూ అందరూ ముందుకొస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమ మేనిఫెస్టోలో మొత్తం 250 అంశాలు ఉంటాయని తెలిపారు.

10:33 AM

గత ప్రభుత్వం గద్దర్‌ను కూడా గౌరవించలేదు : వేముల వీరేశం

పదేళ్లుగా అన్ని రంగాలను ధ్వంసం చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణ ఉద్యమకారులంటే గత ప్రభుత్వానికి గౌరవం లేదని చెప్పారు. గత ప్రభుత్వం గద్దర్‌ను కూడా గౌరవించలేదని ఆరోపించారు. తాము వచ్చాక గద్దర్ జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు చేశారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలో బాధ్యతారాహిత్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రైవేటు వర్సిటీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదని అన్నారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా ఘోరంగా అవమానించారని అన్నారు.

10:28 AM

అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు : వేముల వీరేశం

ప్రియాంకాగాంధీ అంటే బీఆర్ఎస్​ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు. పదేళ్లుగా జరిగిన అవినీతి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తెలిపారు. గ్రామాల్లో బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పదేళ్లుగా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదన్నారు. సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించారని మండిపడ్డారు.

10:24 AM

గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగింది : వేముల వీరేశం

దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం తమదని వేముల వీరేశం అన్నారు. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని తెలిపారు. గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మిగతా రెండు గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

10:19 AM

గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతా: వేముల వీరేశం

గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటీ బయటపడుతున్నాయని తెలిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, పాలమూరు ప్రజలు బీఆర్​ఎస్​ను దూరం పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని గులాబీ నేతలను కోరుతున్నానని అన్నారు.

10:14 AM

గత పదేళ్లలో దళితుల సంక్షేమానికి చేసిందేమీ లేదు: వేముల వీరేశం

ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్​ సర్కార్​ అని వేముల వీరేశం అన్నారు. కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్​ఎస్​ నేతల ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత పదేళ్లలో దళితుల సంక్షేమానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని చెప్పారు. దళితబంధు పేరుతో బీఆర్ఎస్​ నేతలు దళితులను మభ్యపెట్టారని ఆరోపించారు.

10:11 AM
బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ నాకు తెలుసు: వేముల వీరేశం

బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తనకు తెలుసని వేముల వీరేశం అన్నారు. అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదని హితవు పలికారు. అవమానించిన బీఆర్​ఎస్​ను విడిచిపెట్టి కాంగ్రెస్‌లోకి వచ్చానని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌ ప్రజలకు దూరమైందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్‌ గోడలు బద్ధలుగొట్టామని తెలిపారు. కంచెలు ఏర్పాటు చేసుకుని పదేళ్లపాటు పరిపాలించారని ఆవేదన వ్యక్తం చేశారు.

10:08 AM

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. చర్చకు సమాధానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవ్వనున్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించారు. అసెంబ్లీలో తీర్మానాన్నిఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరచనున్నారు. మండలిలో తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించనున్నారు. మండలిలో తీర్మానాన్ని ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ బలపరచనున్నారు.

10:05 AM

నల్లకండువాలు వేసుకుని మండలికి వచ్చిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు

నల్లకండువాలు వేసుకుని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు మండలికి వచ్చారు. దీంతో మండలి లోపలికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించ లేదు. ఆటో కార్మికులను ఆదుకోవాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కాసేపు వాగ్వాదం తర్వాత మండలి భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించింది.

10:01 AM

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌రావు

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని విజ్ఞాప్తి చేశారు. 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.
09:48 AM

శాసనసభ, మండలికి ఆటోల్లో వెళ్లిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఈరోజు శాసనసభ, మండలిలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంకు చర్చ జరగనున్న తరుణంలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఉభయసభలకు ఆటోలో వెళ్లారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు తీసుకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు పోలీసులు, బీఆర్ఎస్​ నేతలు వాగ్వాదానికి దిగారు.

Last Updated :Feb 9, 2024, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.