Suspended SI Warning to People : కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్షన్లో ఉన్న ఓ ఎస్సై భర్త ఉంటున్న ఊరెళ్లి అతడి కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అదేమని ప్రశ్నిస్తే దుర్భాషలాడటంతో పాటు వారిపై చేయి చేసుకున్నాడు.
కోర్టులో కేసు : బాధితులు తెలిపిన వివరాల మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం 75 తాళ్లూరుకు చెందిన గంటా తిరుపతిరావుకు గుంటూరు నెహ్రూనగర్కు చెందిన సింధూరతో 2013లో వివాహం జరిగింది. 2022లో వీరి మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి సింధూర గుంటూరులోని పుట్టింటిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విడాకులు ఇప్పించాలని ఆమె భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టులో కేసు కొనసాగుతోంది.
సస్పెండైన ఎస్సై దందా : ఈ క్రమంలో సింధూర కుటుంబ సభ్యులు తెలిసిన వారి ద్వారా సస్పెండైన ఎస్సై వెంకటయ్యను కలిశారు. సదరు ఎస్సై నల్లపాడు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో 2023 సెప్టెంబర్ 30న ఓ కేసులో తన ఇంటిలో లంచం తీసుకుటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి అరెస్టు చేసి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఎస్సై కొందరితో కలిసి ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నాడు. సింధూర కేసు పరిష్కారం చేస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నాడు.
ఒక్కొక్కడిని తుపాకీతో కాల్చి పడేస్తా : ఈ క్రమంలో ఆదివారం గుంటూరు నుంచి 10 మందిని తీసుకెళ్లి తిరుపతిరావు ఇంటి వద్ద వీరంగం సృష్టించాడు. అక్కడే మద్యం తాగి మత్తులో అడ్డువచ్చిన వారిని దుర్భాషలాడాడు. తుపాకీతో ఒక్కొక్కడిని కాల్చి పడేస్తా అంటూ బెదిరించాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు భయపడి పక్కకు వెళ్లారు. అదే సమయంలో ఇంటిలో ఉన్న సామన్లు అన్నింటిని ఆటోలో వేసుకుని గుంటూరు తరలించాడు. తిరుపతిరావు సోదరుడు గంటా గోపి సస్పెండైన ఎస్సై దౌర్జన్యంపై ఇంటిలో సామనుతో పాటు బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పెదకూరపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.