Police Overaction at Kavali: నెల్లూరు జిల్లాలో పోలీసుల దాష్టీకం.. బీజేపీ నేత తలను కాళ్లతో నొక్కిపట్టి​

author img

By

Published : May 12, 2023, 9:20 PM IST

Updated : May 12, 2023, 10:36 PM IST

Police Trampled on BJP leader head with feet

Police Trampled on BJP leader head with feet: సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై బీజేపీ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. సీఎం కాన్వాయ్​ వస్తుండగా.. అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఓ బీజేపీ నేతను కిందపడేశారు. అంతేకాకుండా రెండు కాళ్ల మధ్య ఆ వ్యక్తి తలను ఉంచి.. నొక్కిపెట్టారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో పోలీసుల దాష్టీకం

Police Trampled on BJP leader head with feet: సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వారు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని కావలి పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్న సమయంలో కావలిలోని ఉదయగిరి వంతెన కూడలి వద్ద.. బీజేపీ నేతలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి పేట్రేగిపోతుందని.. దీనిపై తక్షణమే సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, కావలి మండల అధ్యక్షులు మామిడాలు వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు బీజేపీ నేతలున్నారు.

పైకి లేవకుండా తలని రెండు కాళ్లతో తొక్కిపట్టి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభానికి ముందు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే అవినీతిపై నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డుపడేందుకు ప్రయత్నం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొందరు నాయకులు ప్లకార్డులతో ముఖ్యమంత్రికి నిరసన తెలిపారు. ఉదయగిరి రోడ్డు వద్ద వాహనాలకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి పెరిగిపోయిందంటూ.. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీగా పోలీసులు వచ్చి నిరసనకారులను అడ్డుకున్నారు. కాన్వాయ్​కి అడ్డుపడకుండా పక్కకు లాక్కుపోయారు. డీఎస్పీ వెంకట రమణ బీజేపీ నాయకుడిని కింద పడేశారు. అనంతరం ఆ వ్యక్తి పైకి లేవకుండా అతని తలని.. రెండు కాళ్ల మధ్య ఇరికించారు. కాన్వాయ్ వెళ్లేంత వరకు ఇద్దరు బీజేపీ నాయకులను కిందపడేసి నొక్కిపట్టారు. ఐదుగురు సభ్యులను పోలీస్ స్టేషన్​కి తరలించారు.

కాళ్లతో తన్నిన పోలీసులపై కేసులు నమోదు చేయాలి.. బీజేపీ నేతలను బూటు కాళ్లతో తన్ని, హింసించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. పోలీసు రాజ్యంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతల ఆచూకీ ఇంతవరకు తెలియడం లేదని.. వారిని పోలీసులు కిడ్నాప్ చేసినట్లుగా ఉందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ నేతలపై పోలీసులు అరాచకంగా వ్యవహరించారని.. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెళ్తే అడ్డుకోవడం ప్రజాస్వామ్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిరంకుశ వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. అరెస్టు చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మాట్లాడేందుకు నెల్లూరు ఎస్పీకి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 12, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.