ETV Bharat / state

ఎన్టీటీపీఎస్​పై చర్యలు తీసుకోండి- సీఎం జగన్​కు విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:00 PM IST

Retired IAS EAS Sarma Letter to CM YS Jagan: విజయవాడ ఎన్టీటీపీఎస్ నిబంధనల్ని ఉల్లంఘించి వాతావరణంలో విషవాయువులు విడుదల చేస్తోందంటూ విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ సీఎం జగన్​కు లేఖ రాశారు. దీనిపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Retired_IAS_EAS_Sarma_Letter to CM YS Jagan
Retired_IAS_EAS_Sarma_Letter to CM YS Jagan

Retired IAS EAS Sarma Letter to CM YS Jagan: విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ నిబంధనల్ని ఉల్లంఘించి వాతావరణంలో విషవాయువులు విడుదల చేస్తోందంటూ కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ (EAS Sarma) సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రజారోగ్యం దెబ్బతినేలా విషవాయువులు విడుదల, నీటి వనరుల్లో కాలుష్య కారకాల్ని విడుదల చేయటంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ లేఖ పంపారు.

నిబంధనలు పట్టించుకోవడం లేదు: విజయవాడ ఎన్టీటీపీఎస్ జల, వాయు కాలుష్య కారకాల విడుదలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్లాంట్ చుట్టూ 70 ఎకరాల్లో చెట్లను పెంచాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. పాదరసం, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, సల్ఫర్ లాంటి విష వాయువులను భూగర్భజలాల్లోకి విడుదల చేసేస్తున్నారని ఆరోపించారు.

కాలుష్య కారకాల పరిమితిని ఎప్పటికప్పుడు సాంకేతిక పరికరాలతో పర్యవేక్షించాల్సిన ఏపీ పీసీబీ (Pollution Control Board) నిర్లక్ష్యం వహిస్తోందని ఈఎఎస్ శర్మ తన లేఖలో ఆక్షేపించారు. ఏపీ జెన్కో ప్లాంట్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసినా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం వహిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. గడచిన 8 ఏళ్లుగా నిబంధనల ఉల్లంఘనను ఏపీ పీసీబీ చూసీ చూడనట్టు వదిలేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదు: దీనిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. కాలుష్యం గురించి తెలిసినా ఎన్టీఆర్ జిల్లా ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించటం ఆశ్చర్య పరుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతో ఏపీ పీసీబీ నడుస్తున్నా ఆ సంస్థ ప్రజలకు జవాబుదారీగా పనిచేయకపోవటంపై చర్యలు తీసుకోవాలని ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు.

పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!

Narla Tatarao Thermal Power Station Pollution: అదే విధంగా గతంలో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం కాలుష్యంపై స్థానిక గ్రామాల ప్రజలు సైతం ఫిర్యాదు చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను పరిమితిని మించి తరలిస్తున్నారని, దీని కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. బూడిద రవాణాతో కాలుష్యం పెరిగి అనారోగ్యాలబారిన పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని వాపోయారు. పరిశ్రమ వల్ల తమకు ప్రాణహాని కలుగుతోందని, పచ్చటి పొలాలు సైతం కలుషితం అవుతున్నాయని తెలిపారు. కళ్లు, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయని అన్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గతంలో సమీప గ్రామాల ప్రజలు వాపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.