ETV Bharat / state

పండుటాకులపై వైఎస్సార్సీపీ వికృత రాజకీయం- అమలు చేస్తున్న అధికారులపై చర్యలేవీ? - EC No Actions on Key Officers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 9:39 AM IST

Updated : Apr 4, 2024, 10:46 AM IST

EC_No_Actions_on_Key_Officers
EC_No_Actions_on_Key_Officers

EC No Actions on Key Officers: వైసీపీ వికృత రాజకీయ క్రీడకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ యంత్రాంగం పింఛనుదారుల పాట్లను విపక్షాలపై నెట్టేసేందుకు సహకరిస్తోంది. తెలుగుదేశం పార్టీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ అధికార వైసీపీ అపనిందలు వేస్తుంటే అందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు అధికారులు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది.

పండుటాకులపై వైఎస్సార్సీపీ వికృత రాజకీయం- అమలు చేస్తున్న అధికారులపై చర్యలేవీ?

EC No Actions on Key Officers: పింఛన్ల పంపిణీలో వైసీపీ ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. వృద్ధులు మండుటెండల్లో పింఛను కోసం పడిగాపులు కాచేలా చేశారు. వారు ఇబ్బందులు పడుతుంటే నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు.

ఎన్ని విమర్శలు వచ్చినా బేఖాతరు చేస్తూ ప్రజల ప్రయోజనాలకంటే అధికార పార్టీతో అంటకాగడమే ముఖ్యమని చాటిచెప్పారు. నిజంగా తలచుకుంటే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 1, 2 రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేసేంత విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగు వేయలేదు.

ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న అధికారులు వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల పింఛనుదారులను సచివాలయాల వద్దకు రప్పించారు. వారికి కష్టనష్టాలు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించారు. ఇదే అదనుగా చెలరేగిన అధికార పార్టీ నాయకులు నెపం మొత్తాన్ని విపక్షాలపైకి నెట్టేసి ప్రజల దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశంపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు - సమస్యలతో హారతి ఇస్తున్న ఓటర్లు - protest to ysrcp mla Candidates

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కక్షగట్టిన జగన్‌ ప్రభుత్వం ఆయన నటించిన భీమ్లానాయక్‌ సినిమా టిక్కెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతించలేదు. సరికదా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడ ధరలు పెంచేస్తాయోనని రెవెన్యూ అధికారులతో నిఘా పెట్టించింది. వారికి థియేటర్ల వద్ద డ్యూటీలు వేసింది.

దేశంలో ఎక్కడా చూడనట్టు మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ పెద్దలు తానా అంటే తందానా అనే ఉన్నతాధికారులు వారికి అవసరమైనప్పుడు ఉద్యోగులను ఎలాంటి పనులకైనా వాడేస్తారు. కానీ అభాగ్యులకు పింఛన్లు ఇచ్చేందుకు మాత్రం సరిపడా ఉద్యోగులు లేరని చెబుతున్నారు.

1.27 లక్షల మంది వార్డు, గ్రామసచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ వేసవి, ఎన్నికల దృష్ట్యా వారిపై అంత పని ఒత్తిడేమీ లేనప్పటికీ వారితో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయించేందుకు ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, వార్డు కార్యదర్శులు తీరిక లేకుండా ఉన్నారని వారికి పింఛన్ల పంపిణీ అప్పగించలేమనే వింత వాదన తెరపైకి తెచ్చారు.

ఓటర్లను ప్రభావితం చేస్తున్న వాలంటీర్లను నియంత్రించాల్సిన బాధ్యతను సీఎస్‌ సహా మిగతా అధికారులు విస్మరించడం వల్లే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు వ్యవస్థలను కట్టుదిట్టం చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇళ్ల దగ్గర పింఛన్​ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ? ఉద్యోగులు లేరా ?: పవన్ కల్యాణ్ - Pawan Kalyan on pensions issue

ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమేనని సర్వీసులో చాలా జూనియర్లయిన జిల్లా కలెక్టర్లే చెబుతుంటే సీనియారిటీ కలిగి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సీఎస్‌ వంటి సీనియర్‌ అధికారులకేమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 65.92 లక్షల మంది పింఛనుదారులుంటే వారిలో 34.18 లక్షల మంది వృద్ధులే! అన్ని లక్షల మంది ఎండల్లో మాడిపోయే పరిస్థితి కల్పించిన ఉన్నతాధికారులకు మనస్సాక్షి ఉందా? మానవత్వం అన్న పదానికి వారికి అర్థం తెలుసా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బుధవారం పింఛన్ల పంపిణీ తొలి రోజు వృద్ధులు అనేక ఇబ్బందులుపడ్డా దిద్దుబాటు చర్యలు లేవు. రాష్ట్రంలో గురువారం 130 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 250 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థ హెచ్చరికలనే బేఖాతరు చేస్తూ పంపిణీని కొనసాగించేందుకు అధికారులు మొండిపట్టుతోనే వ్యవహరిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తే ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డి, శశిభూషణ్‌కుమార్‌ వంటి అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా, ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాల్సిన సీఎస్‌ జవహర్‌రెడ్డి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

ఎన్నికల సమయంలోనైనా రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే ఉన్నతాధికారులు ఒక పార్టీకి కొమ్ముకాస్తుంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తుండటమేంటి? అధికారంలో ఉన్న పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి విపక్షాలపై బురదజల్లుతుంటే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా సీఎస్‌కు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు?

వైసీపీపై అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడని అధికారులను అవే పోస్టుల్లో కొనసాగిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయి? అన్న ప్రశ్నలు వివిధ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే రాబోయే 40 రోజుల్లో మరిన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Last Updated :Apr 4, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.