ETV Bharat / state

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 1:57 PM IST

CM YS JAGAN NEGLECTED ONGOLE DAIRY: ప్రకాశం జిల్లాలో రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త కాగా, వేల మందికి ఉపాధి చూపింది ఒంగోలు డెయిరీ. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లుగా ఉన్నాయి. వాటిని తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. పాదయాత్ర వేళ ఆదుకుంటానంటూ మొసలి కన్నీరు కార్చిన జగన్‌, గద్దెనెక్కిన తర్వాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. ఎంతోమందికి బతుకునిచ్చే ఒంగోలు పాల డెయిరీకి పాడె కట్టారు. వందల మంది ఉద్యోగులు, కార్మికులను రోడ్డున పడేశారు.

ongole_dairy
ongole_dairy

CM YS JAGAN NEGLECTED ONGOLE DAIRY: సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూల్చడమే తప్ప కట్టడం తెలియదు. కడుపులు మాడ్చడమే తప్ప నింపేందుకు మనసు రాదు. అవకాశాలున్నా, అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయలేదు. ప్రకాశం జిల్లాకు పెద్ద పరిశ్రమలు ఒక్కటీ తేలేదు సరికదా ఉన్నవి సైతం బతకనివ్వలేదు. పది మందికి బతుకునిచ్చే ఒంగోలు పాల డెయిరీకి పాడె కట్టారు.

వందల మంది ఉద్యోగులు, కార్మికులను రోడ్డున పడేశారు. వేల సంఖ్యలోని రైతు కుటుంబాలకు ఉన్న ఏకైక పెద్ద దిక్కును మూసివేయించారు. జిల్లాకు ప్రపంచ స్థాయిలోనే ఓ గుర్తింపుగా నిలిచిన ఒంగోలు జాతి గిత్తల సంరక్షణ ఊసే మరిచారు. ఒంగోలు జాతి గిత్తల మనుగడకే ముప్పు వాటిల్లుతున్నా ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయారు. మొత్తానికి ఒంగోలు బ్రాండ్‌కే బ్యాండ్‌ వేసి, ఇట్లుంటది వినాశకారి జగన్‌ తోని అని ప్రజలంతా చెప్పుకొనేలా చేశారు.

పట్టించుకోలేదు: ఒంగోలు గిత్తలు, ఆవుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చేపట్టిన ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. ప్రపంచంలోనే మేలు రకం జాతిగా ఒంగోలు గిత్తలు, ఆవులకు పేరు ఉంది. ఇటువంటి వాటిని పరిరక్షించి మరింత అభివృద్ధి చేసేలా పాటుపడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పట్టించుకోలేదు. దీంతో గతంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఒంగోలు గిత్తల సంఖ్య ప్రస్తుతం 50 వేలకు పడిపోయింది. పశువుల మేతకు వీలుగా ఉన్న బీడు భూములను కూడా వైసీపీ నేతలు చాలా వరకు ఆక్రమించారు. వాటికి మేత కూడా దొరికే పరిస్థితి లేకపోయింది.

అమూల్​పై ఎనలేని ప్రేమ - కోట్ల విలువైన సహకార డెయిరీలు అప్పగింత

ఒంగోలు డెయిరినీ అమూల్‌కు కట్టబెట్టి: జగన్‌ సర్కారు 2020లో పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంచి ధర ఇస్తామంటూ జిల్లా కలెక్టర్‌ నుంచి సచివాలయ సిబ్బంది వరకు అందరితో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఒంగోలు డెయిరినీ అమూల్‌కు కట్టబెట్టి, 176 పాల కేంద్రాల నుంచి పాలను సేకరించేలా ప్రణాళిక రచించింది. చెప్పిన ధర చెల్లించకపోవడం, పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోవడం, కొన్ని మండలాల్లో మాత్రమే సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో పాడి రైతులు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఇందులో దాదాపు సగం కేంద్రాలు మూతపడ్డాయి. ‌తాళ్లూరు మండలంలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేస్తే, అందులో 13 నిరుపయోగంగా మారాయి. ముండ్లమూరు మండలంలో 22 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 11 అలంకారప్రాయంగానే మిగిలాయి.

కొండెక్కిన ప్లాంట్‌- రోడ్డున పడ్డ ఉద్యోగులు: బహిరంగ మార్కెట్‌లో రూ. వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఒంగోలు డెయిరీ జిల్లాలోని పాడిరైతులకు గతంలో ఓ వరం. ఆసియాలోనే రెండో అతి పెద్దదిగా పేరు. 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన పౌడర్‌ ప్లాంట్‌తో పాటు, రోజుకు 6 లక్షల లీటర్ల పాల సేకరణతో లక్ష మంది జీవితాల్లో వెలుగులు నింపింది. మితిమీరిన రాజకీయ జోక్యంతో క్రమంగా ప్రాభవం కోల్పోయింది. గత టీడీపీ ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేసింది. అధికారులతో కూడిన పాలకవర్గాన్ని నియమించి రూ.35 కోట్ల నిధులు కేటాయించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తానే అమూల్‌కు కట్టబెట్టింది. రోజుకు 18 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న పరిస్థితిని పెంచాల్సిన అమూల్‌ నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదంటూ ఏకంగా మూసేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. లక్ష మంది రైతుల జీవితాలకు భరోసాగా నిలిచిన ప్లాంట్‌ కొండెక్కింది.

ఇదేం పెద్దరికం పెద్దిరెడ్డి.. నువ్వే పాడి రైతులను దోచుకుంటే ఎలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.