ETV Bharat / state

ఏపీ ఎన్నికలపై పందెంరాయుళ్ల చూపు - కూటమి వైపే మొగ్గు - Betting on andhra pradesh elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 10:01 AM IST

Betting on Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు పందెంరాయుళ్లకు ప్రధాన వనరుగా మారింది. ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. అయితే పందెగాళ్ల చూపులు అన్నీ కూటమిపైనే ఉన్నాయి. కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు.

Betting on Andhra Pradesh Elections
Betting on Andhra Pradesh Elections (ETV Bharat)

Betting on Andhra Pradesh Elections 2024: రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్‌ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు.

నెల రోజుల క్రితం కూటమికి 100-110 సీట్లు అని చెప్పిన వీరంతా తాజాగా లెక్కలు పెంచేశారు. ప్రస్తుతం కూటమి దూకుడును బట్టి 120-130కు పైగా స్థానాలు వస్తాయని 1:2 చొప్పున పందేలు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయలు, పులివెందులలో జగన్‌, కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీపై 1:2, వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ సాధించే సీట్లపై 1:1 చొప్పున కోట్ల రూపాయలలో పందేలు సాగుతున్నాయని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి తెలిపారు.

కోడిపందేలకు వాసికెక్కిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో లక్ష రూపాయలకు లక్షన్నర, లక్షకు 5 లక్షల రూపాయలు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. చోటా నాయకులు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5 శాతం కమీషన్‌ ఇవ్వాలంటూ మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరువ్యాపారులు 50 వేల నుంచి కోటి రూపాయల వరకు పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపై కూడా భారీగా పందేలు జరుగుతున్నాయి.

జగనన్నపై బెట్టింగ్​కు జంకుతున్న పందెంరాయుళ్లు - Bookies bet big on TDP win in AP

టాప్‌ 10 నియోజకవర్గాలివే: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్నచోట పెద్ద మొత్తంలో పందేలు సాగుతున్నాయి. రాష్ట్రంలో జోరుగా పందేలు సాగుతున్న టాప్‌ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి.

వీటిపైనా జోరుగా బెట్టింగులు: ఆ తర్వాత స్థానాల్లో నెల్లూరు రూరల్‌, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్‌, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ-వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల రూపాయల పందేలు కాస్తున్నారు.

గుడివాడలో బెట్టింగ్​ మాఫియా - యువత, ఉద్యోగులే లక్ష్యంగా ఎమ్మెల్యే అనుచరుల దందా - BETTING IN GUDIVADA

పవన్‌ కల్యాణ్‌ 50 వేలకు పైగా మెజారిటీ: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి రెండున్నర కోట్ల రూపాయలు దళారి వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతోంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు, పులివెందులలో జగన్‌ మోహన్ రెడ్డి మెజారిటీపై బెట్టింగులు పంటర్లకు కాసులు కురిపించనున్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే, గతంలో కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్‌ కాస్తున్నారు. పులివెందులలో జగన్‌ మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలు సాగుతున్నాయి.

వెనక్కి తగ్గుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు: 3 రోజుల వ్యవధిలోనే వాతావరణం తారుమారైంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలవకపోతే పొలాలు రాసిస్తామంటూ సవాల్‌ విసిరిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే మధ్యవర్తుల వద్ద డబ్బు ఉంచినవారు, కమీషన్‌ తీసుకొని తిరిగి సొమ్ము ఇవ్వమంటూ కాళ్లబేరానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫున తొలుత మొగ్గు చూపిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. గుడివాడలో 1:10 అంటూ చెప్పిన అధికార పార్టీ నాయకుడు రెండు రోజుల నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది. కాకినాడలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి మెజారిటీపై తొలుత 25 లక్షల రూపాయలు పందెం అంటూ వచ్చిన ఒక వ్యాపారి ప్రస్తుతం 5 లక్షల రూపాయలతో సరిపెట్టారు.

కాయ్‌ రాజా కాయ్‌లో తేలిపోతున్న ఫ్యాన్‌ గాలి - అధికార మార్పిడిపై వెయ్యి కోట్లు బెట్టింగ్స్‌ - Election bettings on andhra pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.