ETV Bharat / sports

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఐదు టెస్టులు - బీసీసీఐ కీలక నిర్ణయం - Border Gavaskar Trophy 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:07 PM IST

Border Gavaskar Trophy 2024
Border Gavaskar Trophy 2024

Border Gavaskar Trophy 2024 : ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో చిన్న మార్పు చేసినట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆ విశేషాలు మీ కోసం

Border Gavaskar Trophy 2024 : క్రికెట్ హిస్టరీలో రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్‌ సిరీస్‌లను ప్రత్యేకంగా భావిస్తారు. ఇలాంటి సిరీస్‌లలో విజయం సాధించడాన్ని ఇరుజట్లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. అలాంటి ఓ సిరీసే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మార్క్యూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగేవి. అయితే ఇకపై ఐదు టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు సోమవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. 1991-92 సీజన్ తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది చివర్లో భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు ఆడుతాయి.

2024-25 సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు చేసిన పోస్టులో "1991-92 తర్వాత మొదటిసారిగా, ఆస్ట్రేలియా, భారత్‌ ఐదు-టెస్టుల సిరీస్‌లో పోటీపడతాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎక్స్‌టెండెడ్‌ సిరీస్‌ 2024-25 హోమ్ సమ్మర్ షెడ్యూల్‌ త్వరలో రిలీజ్‌ చేస్తాం." అని పేర్కొంది.

ఈ అప్‌డేట్‌ని బీసీసీఐ, సీఏ సంయుక్తంగా ప్రకటించాయి. బీసీసీఐ సెక్రట్రీ జే షా, క్రికెట్‌ ఆస్ట్రేలియా మీడియా ప్రకటనలో " మేము అత్యంత గౌరవంగా భావించే టెస్ట్ క్రికెట్ గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడంలో బీసీసీఐ అంకితభావంలో స్థిరంగా ఉంది’ అని పేర్కొన్నారు. టెస్ట్‌ క్రికెట్‌ అభివృద్ధికి, మరింత ప్రాధాన్యం కల్పించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ కలిసి కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్ట్‌లకు పెంచాము" అని జే షా స్పష్టం చేశారు. టెస్ట్ క్రికెట్ లెగసీని విస్తరించడానికి, దాని వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆ నాలుగింటిలోనూ విజయం
2018-19, 2020-21లో ఆడిన చివరి నాలుగు సిరీస్‌లలో టీమ్‌ ఇండియా విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఖంగారూలను ఓడించడం విశేషం. అయితే గత ఏడాది లండన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్‌ భారత్‌ను ఓడించింది.

ఈ ఏడాది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రారంభ టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరం నవంబర్ చివరిలో సిరీస్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. "మా రెండు గొప్ప క్రికెట్ దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ ఉత్సాహం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టులకు పొడిగించినందుకు సంతోషంగా ఉన్నాం." అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్ మైక్ బైర్డ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.