ETV Bharat / politics

రాజ్యసభ ఎన్నికలపై చంద్రబాబు క్లారిటీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 10:49 AM IST

Updated : Feb 14, 2024, 3:22 PM IST

chandrababu on rajya sabha elections
chandrababu on rajya sabha elections

TDP on Rajya Sabha Elections : అభ్యర్థుల మార్పిడి, ఆరు జాబితాల్లోనూ చోటు దక్కని అసంతృప్తులు వెరసి రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి గర్వభంగం తప్పదా? అధికార వైఎస్సార్సీపీలో అసంతృప్త జ్వాలలు మరోసారి ఆత్మప్రబోధానుసారం అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. దాదాపు 70మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్లు రాజకీయవర్గాల్లో హాట్​ టాపిక్. తమ అభిప్రాయానికి ఏ మాత్రం విలువివ్వని తాడేపల్లి బ్యాచ్​కి అసంతృప్త ఎమ్మెల్యేలు కీలెరిగి వాతపెట్టనున్నట్లు సమాచారం. అయితే తీవ్ర కసరత్తు చేసిన అనంతరం రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయరాదని చంద్రబాబు నిర్ణయించారు.

TDP on Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్​ నేపథ్యంలో బరిలో నిలిచేందుకు సాధ్యాసాధ్యాలపై టీడీపీ కసరత్తు చేసింది. అభ్యర్థిని ఎంపిక చేయాలా ? వద్దా ? అనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు. రాష్ట్రంలోని 3 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్​ వెలువడగా రేపటితో (ఈ నెల 15) నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామంటూ తెలుగుదేశం నేతలతో వైఎస్సార్​సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపారు. సుమారు 70మంది వరకూ ఉన్న జాబితాను ఆ ఎమ్మెల్యేలు అందించినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ ఎమ్మెల్యేల బలం 22కు పడిపోగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం గంటా న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.

ఒకవేళ తెలుగుదేశం తన అభ్యర్థిని బరిలోకి దించితే ప్లాన్​ -బీ అమలు చేసేందుకు వైసీపీ పెద్దలు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసంతృప్త ఎమ్మెల్యేలను అవసరమైతే విదేశీ పర్యటనకూ తీసుకెళ్లి పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజ్యసభ స్థానాల కోసం వైసీపీ ప్లాన్ - ఎమ్మెల్యేలకు ఫారిన్ ట్రిప్ ఆఫర్!

రాజ్యసభ అభ్యర్థి విజయానికి 44 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యం ఓట్ల అవసరం. ఈ నెల 27న రాజ్యసభ ఖాళీలకు పోలింగ్ జరగనుంది. వైఎస్సార్​సీపీ మూడు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా, ఆ పార్టీ తరుఫున వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్​సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఆ పార్టీ నిమగ్నమై ఉంది.

నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు

రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపేందుకు అధినేత చంద్రబాబు ఆసక్తి చూపారు. వైసీపీలో నియోజకవర్గ ఇన్​చార్జీల మార్పు, ఎమ్మెల్యేల బదిలీలకు తోడు ఇటీవల విడుదలైన ఆరు జాబితాల్లో చోటు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సీట్ల మార్పు చేర్పుల కారణంగా టికెట్​ దక్కని, స్థానచలనం పొందిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల​ ఓట్లపై టీడీపీ అధిష్ఠానం గురి పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా క్రాస్​ ఓటింగ్​కు అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాజ్యసభకు సోనియా గాంధీ- రాయ్​బరేలీ నుంచి బరిలోకి ప్రియాంక!

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ప్రస్తుత సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా విజయానికి 44 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇరుపార్టీల బలాబలాలను పరిశీలిస్తే టీడీపీకి గెలిచే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. కానీ, వైసీపీ టికెట్లు నిరాకరించిన 26 మందితోపాటు ఆ పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను కలిపితే సుమారు 30 మంది శాసనసభ్యులు టీడీపీతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఝలక్‌తో కంగుతిన్న వైసీపీ పెద్దలు ఈ సారి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

మళ్లీ తెరపైకి 'ఆత్మప్రబోధ' : రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని భావిస్తోన్న వైసీపీ అధిష్ఠానం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామాను స్పీకర్​ ఆమోదించగా పార్టీ ధిక్కారం ఆరోపణలతో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్​ ధిక్కరించి ఆత్మప్రబోధానుసారం అనే నినాదాన్ని ప్రచారం చేసిన నలుగురు ఎమ్మెల్యేపై చర్యలకు సమాయత్తమైంది. ఇదే సమయంలో టీడీపీ సైతం వైసీపీలోకి జంప్‌ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు వైపులా చెరి నాలుగు ఓట్లు తగ్గడంతో పాటు 'అసంతృప్తి' అధికార పార్టీకి తలనొప్పి తీసుకురావడం తథ్యమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికల కోసం అసంతృప్తి నేతల బుజ్జగింపులు - మంత్రి జయరాంకు సీఎంవో నుంచి పిలుపు

రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు దక్కించుకోడానికి అవసరమైన బలం ఉన్నా మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వైసీపీలో గుబులు మొదలైంది. మూడు స్థానాల్ని గెలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. సీఎం జగన్‌ నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించినా మంత్రి గుమ్మనూరు జయరాం, కాపు రామచంద్రారెడ్డి లాంటి స్పందించలేదు. ఈ క్రమంలో ఆయా నేతలను నయానో భయానో లొంగదీసుకునేందుకు నేరుగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులు ఇద్దరు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ప్లాన్​ - బీ అమలుకు వైఎస్సార్సీపీ యోచన : ఒకవేళ తెలుగుదేశం తన అభ్యర్థిని బరిలోకి దించితే ప్లాన్​ -బీ అమలు చేసేందుకు వైసీపీ పెద్దలు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసంతృప్త ఎమ్మెల్యేలను అవసరమైతే విదేశీ పర్యటనకూ తీసుకెళ్లి పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్‌ థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లడంపై చర్చ జరుగుతోందని వినిపిస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయరాదని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు నేతల సమావేశంలో ఈ విషయం తెలిపారు.

Last Updated :Feb 14, 2024, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.