Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in YSR District : చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టింది. ఈ యాత్ర ద్వారా మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారికి ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతలుగా వివిధ జిల్లాలలో ఈ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగనుంది.
విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' పథకం - ప్రకటించిన నారా భువనేశ్వరి
ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి ఉదయం 9.30 గంటలకు భువనేశ్వరి చేరుకున్నారు. అక్కడ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామానికి వెళ్లారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్థాపం చెంది మృతి చెందిన రెడ్డమ్మ అనే మహిళ కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అలాగే రాయచోటిలోని గాజుల కాలనీలో మృతి చెందిన రవీంద్రరాజు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. బాధిత కుటుంబానికి భువనేశ్వరి మూడు లక్షల చెక్కును అందజేశారు.
Bhuvaneswari Nijam Gelavali Yatra : అనంతరం పెద్ద సంఖ్యలో తరిలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి ఉద్వేగంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటినుంచి 50 రోజులపాటు శక్తి వంచన లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనకు ఇక స్వస్తి పలకాలన్నారు.
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీకి మీరంతా అండగా ఉండాలని కోరారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టించిందని భువనేశ్వరి తెలిపారు. ఆయన ఏనాడు తప్పు చేయని వ్యక్తిన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. ప్రజలంతా సైనికుల్లా పనిచేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రాయలసీమలోనే ఎక్కువ ఏళ్లు గడిపాను నాకూ పౌరుషం ఎక్కువే అని సరదాగా వ్యాఖ్యానించారు. రాయలసీమకు వెళ్లొద్దని చాలామంది తనతో చెప్పారని గుర్తుచేశారు. మీరంతా నాకు అండగా ఉన్నప్పడు నేనెందుకు భయపడతానన్నారు. పోలింగ్ సమయంలో ఎవరూ ఇంట్లో కూర్చోవద్దు, అందరూ బయటికి వచ్చి ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. న్యాయం గెలవాలి, నిజం గెలవాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం - నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి